- 50 గ్రాముల ఎమ్డీఎమ్ఏ, 45 కిలోల గంజాయి
- పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు
హైదరాబాద్, వెలుగు: సైబరాబాద్ పోలీసులు డ్రగ్స్, గంజాయిపై స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ సప్లయర్ల నెట్వర్క్ను బ్రేక్ చేస్తున్నారు. ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారంతో బుధవారం10 మందిని అరెస్ట్ చేశారు. 50 గ్రాముల ఎమ్డీఎమ్ఏ,45 కిలోల గంజాయి, 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు. మాదాపూర్ వెస్టిన్ హోటల్ సమీపంలో ఈ నెల12న డ్రగ్స్ సప్లై చేస్తున్న మహ్మద్ బిన్ హసన్, లక్డీకాపూల్కు చెందిన కొండ్ల రాకేశ్ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 3 గ్రాముల ఎమ్డీఎమ్ఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు బుధవారం హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో నిఘా పెట్టారు. ముంబైకి చెందిన రహెద్ అలీ(45), యాసిన్ ఖాన్(27), థానేకు చెందిన ఇఫ్తికర్ అహ్మద్(37)ను అరెస్ట్ చేశారు. 42 గ్రాముల ఎమ్డీఎమ్ఏ, కారును స్వాధీనం చేసుకున్నారు.
బాచుపల్లిలో ఐటీ ఎంప్లాయ్..
బాచుపల్లిలో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేసి, ప్రగతి నగర్కు చెందిన ఐటీ ఎంప్లాయ్ మరీదు శ్రీనివాస్(21) వద్ద 3 గ్రాముల ఎమ్డీఎమ్ఏను సీజ్ చేశారు. శ్రీనివాస్ ఇచ్చిన సమాచారంతో మేడ్చల్ ముఖద్దమ్పూర్కు చెందిన జుదె జీవన్, జగద్గిరిగుట్టకు చెందిన భవాని శంకర్, చిలుకోటి శివరామ్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 2 గ్రాముల ఎమ్డీఎమ్ఏను స్వాధీనం చేశారు. విజయవాడకు చెందిన అఫ్రిది, బెంగళూరుకు చెందిన సుధాకర్ డ్రగ్ సప్లయ్ చేసినట్లు గుర్తించారు. రాజేంద్రగనర్లో గంజాయి సప్లయ్ చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ నుంచి మహారాష్ట్ర తరలిస్తున్న మహ్మద్ అబ్దుల్ సలామ్, గోవింద్ రవీంద్ర, పిట్టల ఉపేంద్ర వద్ద 45 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ట్రైన్లో గంజాయి రవాణా
సికింద్రాబాద్, వెలుగు: ట్రైన్లలో స్మగ్లింగ్ను అరికట్టేందుకు కొద్దిరోజులుగా జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు దాడులు చేసి వందల కిలోల గంజాయిని పట్టుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం కోణార్క్ ఎక్స్ప్రెస్లో తనిఖీలు నిర్వ హించి 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్, బెహరన్ పూర్లకు చెందిన అంబికా నహాక్(38), మాలతి సాహు (34) అనే ఇద్దరు మహిళలు అక్కడి నుంచి ట్రైన్లో సికింద్రాబాద్ మీదుగా ముంబైకి గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు వేర్వేరు కోచ్లలో ప్రయాణిస్తున్న ఆ ఇద్దరి బ్యాగులను చెక్ చేసి గంజాయిని సీజ్ చేశారు. దీని విలువ రూ. 24 లక్షలు ఉంటుందని బుధవారం సికింద్రాబాద్ రైల్వే ఇన్చార్జ్ డీఎస్పీ శ్రీనివాస్ రావు వెల్లడించారు. గత 2 నెలల వ్యవధిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపట్టి, 300 కిలోలకు పైగా గంజాయిని సీజ్ చేశామన్నారు. ఇప్పటివరకు 7 కేసులలో 11 మందిని అరెస్ట్ చేశామన్నారు.