- ట్రిపుల్ ఆర్, ఐఐఎంకు సహకరించండి
- తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయండి
- దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.1 శాతం
- దాన్ని 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నం
- రాష్ట్రాలకిస్తున్న వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చండి
- విద్య, ఆరోగ్య రంగాల కోసం సేకరించే వనరులను
- ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి మినహాయించాలని రిక్వెస్ట్
- కేంద్ర మంత్రి నిర్మల నేతృత్వంలో ఆర్థిక మంత్రుల సమావేశం
- తెలంగాణ తరఫున పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి,
- ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని, ట్రిపుల్ ఆర్, మెట్రో, ఐఐఎంకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ప్రధానంగా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించాలని రిక్వెస్ట్ చేశారు. శనివారం ఢిల్లీలోని అశోకా హోటల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ప్రీ బడ్జెట్(కేంద్ర బడ్జెట్ సన్నాహక) సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర రాష్ట్రాలు/ యూటీల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారానికి సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి భట్టి విక్రమార్క తీసుకెళ్లారు. ‘‘ఒక దేశం కేంద్ర, రాష్ట్రాల సమన్వయం ద్వారానే పురోగమిస్తుంది. కేంద్ర బడ్జెట్ తయారీలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడం ముఖ్యమైన చొరవ. ఇది సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుంది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది” అని వ్యాఖ్యానించారు.
ఆ నిధులను ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి మినహాయించండి..
రాష్ట్రాలకు ఇస్తున్న 50 ఏండ్ల వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చాలని, ఆ సహాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాల కోసం సేకరించే వనరులను ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని విన్నవించారు. తెలంగాణలో ప్రస్తుతం వెయ్యికి పైగా కులాలవారీగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయన్నారు. అయితే... తమ ప్రభుత్వం కులాల అంతరాలు, వర్గాల తేడాలు లేకుండా.. 119 నియోజకవర్గాల్లో ఆధునిక వసతులతో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నదని వివరించారు. ఈ స్కూళ్లలో అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకుంటారని చెప్పారు. అలాగే, అనేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కేంద్రం తన మొత్తం వ్యయంలో 20 శాతం కంటే ఎక్కువ రాష్ట్ర, ఉమ్మడి జాబితా అంశాలపై ఖర్చు చేస్తున్నదన్నారు. ఇందులో 25 శాతం తగ్గించి, ఆ రూ.2.21 లక్షల కోట్లను నేరుగా రాష్ట్రాలకు బదిలీ చేయాలని సూచించారు. వీటితోపాటు ప్రస్తుతం సెస్లు, సర్చార్జీల వాటా కేంద్ర పన్ను రాబడిలో 20 శాతానికి చేరిందని గుర్తు చేశారు. దీని వల్ల 15వ ఆర్థిక సంఘం 41 శాతం పన్ను బదిలీని సిఫార్సు చేసినప్పటికీ.. రాష్ట్రాలకు కేవలం 30 శాతం మాత్రమే అందుతున్నదని గుర్తు చేశారు. దాదాపు రూ1,55,000 కోట్ల సర్ చార్జీలను మౌలిక సదుపాయాల నిధికి మళ్లించాలన్నారు. లేదా వాటిని ప్రాథమిక పన్ను రేట్లలో కలిపి రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ట్రిపుల్ ఆర్, మెట్రో, ఐఐఎంకు సహకరించండి..
విద్యా, వైద్యం, మౌలిక వసతులతోపాటు రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చి, అభివృద్ధి పథంలో నడిపే కీలక ప్రాజెక్టులను మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక భేటీలో ప్రస్తావించింది. రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని కేంద్రాన్ని భట్టి విక్రమార్క కోరారు. అలాగే, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్ కు సంబంధించత్వరగా నిర్ణయం తీసుకొని, అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటును చేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్లు మంజూరు చేయాలని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం రూ14,100 కోట్లు, రేడియల్ రోడ్ల కోసం రూ45 వేల కోట్లు, హైదరాబాద్ మురుగునీటి పారుదల ప్రణాళిక కోసం రూ17,212 కోట్లు కేటాయించాలని కోరారు.
దేశ జీడీపీలో తెలంగాణ వాటా డబుల్ చేస్తం..
ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.1 శాతం గా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్ను ఆవిష్కరించిన విషయం సమావేశంలో వివరించారు. ఈ విజన్తో తెలంగాణను 200 బిలియన్ డాలర్ల నుంచి 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తద్వారా దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అలాగే, మౌలిక సదుపాయాల కల్పన కోసం తెలంగాణలో పెట్టుబడి రేటును ప్రస్తుత 37 శాతం నుంచి 50 శాతానికి (జీఎస్డీపీ) పెంచాల్సి ఉందన్నారు. రాష్ట్రాల ద్రవ్య లోటు పరిమితిని ఏడాదికి కనీసం 4 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని కేంద్రానికి సూచించారు.
