
వనపర్తి టౌన్, వెలుగు: నిర్లక్ష్యానికి గురవుతున్న వయోవృద్ధులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్ లైన్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పిల్లలు పట్టించుకోకుండా వదిలేస్తే, అలాంటి వారు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం–2007 ద్వారా న్యాయం పొందవచ్చన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్డీవో వద్ద ట్రిబ్యునల్ కేసులు పెట్టాలని సూచించారు. ఆర్డీవో దగ్గర న్యాయం దక్కకపోయినా, పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినా కలెక్టర్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు.
ట్రిబ్యునల్ కేసు పెట్టాలన్నా, కలెక్టర్ వద్ద అప్పీల్ చేసుకోవాలనుకున్న వారు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం టీఎస్ సీఎంఎంఎస్ ఆన్ లైన్ పోర్టల్ ను ఏర్పాటు చేసిందని, ఈ పోర్టల్ ద్వారా జిల్లాలోని వయోవృద్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మెయింటెనెన్స్ కు సంబంధించిన కేసులతో పాటు ఇతర కేసులను ఆన్లైన్ పోర్టల్, మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.