- ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తం-మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి
రామచంద్రాపురం, వెలుగు: హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ఇండస్ర్టియల్ ఏరియాల్లో చదువుతున్న ఐటీఐ స్టూడెంట్స్కు తగిన ప్రోత్సాహం అందించి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం తోషిబా కంపెనీలో జపాన్ ఇండియా ఇనిస్టిట్యూట్ఆఫ్ మాన్యుఫాక్షర్స్ సంస్థ ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంను శనివారం వారు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలతో పరిశ్రమలకు కావాల్సిన ఉద్యోగులు ఇక్కడే తయారవుతారని అన్నారు. ట్రైనింగ్ అందిస్తున్న సంస్థలు ఐటీఐ కాలేజీలను దత్తత తీసుకొని ప్రోత్సాహం అందించాలని కోరారు. కంపెనీల అవసరాలకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు రావాలని, తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఎంపీలు ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, కలెక్టర్ హనుమంతరావు, జపాన్ ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం హరీశ్రావు సంగారెడ్డిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన వివిధ యూనిట్ల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.