సింగరేణి ల్యాండ్ను కబ్జా చేస్తున్రు!.. కొత్తగూడెం నడిబొడ్డున రూ.150కోట్ల విలువైన స్థలాన్ని కాజేసేందుకు స్కెచ్

సింగరేణి ల్యాండ్ను కబ్జా చేస్తున్రు!..  కొత్తగూడెం నడిబొడ్డున రూ.150కోట్ల విలువైన స్థలాన్ని కాజేసేందుకు స్కెచ్
  • గవర్నమెంట్​కు సింగరేణి సరెండర్ చేయనున్న ల్యాండ్​పై కబ్జాదారుల కన్ను 
  • నగరంలోని పలుచోట్ల డ్రెయినేజీలపై వెలిసిన అక్రమ నిర్మాణాలు 
  • అధికారులు పట్టించుకోవడం లేదంటున్న స్థానికులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నగరం నడిబొడ్డున కూలీ లైన్​లో గల రూ. వందల కోట్ల విలువ చేసే సింగరేణి ల్యాండ్​పై కబ్జాదారుల కన్ను పడింది. క్రమంగా కొద్దికొద్దీ మొత్తం కాజేసే ప్లాన్​ లో ఉన్నారు. తమ ఆధీనంలో ఉన్న దాదాపు రూ.150కోట్లకు పైగా విలువైన పదెకరాల  ల్యాండ్​ను సింగరేణి త్వరలో గవర్నమెంట్​కు సరెండర్​ చేయనుంది. ఇందుకు సంబంధించి ఫైల్​ కూడా రెడీ అయ్యింది. దీంతో కొందరు బడా బాబులు పొలిటికల్​ లీడర్ల అండదండలతో కబ్జాకు స్కెచ్​ వేస్తున్నారు.  

అందరి కన్ను కూలీలైన్​భూములపైనే.. 

కొత్తగూడెం నగరంలోని కూలీలైన్​లోని ల్యాండ్​కు మంచి డిమాండ్​ ఉంది. ఇక్కడ గజం రూ.50వేల నుంచి రూ. లక్ష వరకు ధర పలుకుతోంది. కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్​గా మారటంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గవర్నమెంట్​అవసరాల నిమిత్తం కూలీలైన్​లో దాదాపు రూ. 150కోట్లకు పైగా విలువైన సింగరేణి ల్యాండ్​ను యాజమాన్యం ప్రభుత్వానికి సరెండర్​ చేయనుంది. ఈ విషయం తెలుసుకున్న కొందరు బడాబాబులు తమ రాజకీయ పలుకుబడితో ఆ ల్యాండ్​ను సరెండర్​ చేసేలోపే కొద్దికొద్దీగా ఆక్రమించుకునేందుకు స్కెచ్​వేశారు. 

ఇదీ పరిస్థితి... 

ఓ మాజీ కౌన్సిలర్​ కూలీలైన్​లో ఉన్న సింగరేణి ల్యాండ్​లో  దాదాపు 250 గజాలకు పైగా కబ్జా చేసే క్రమంలో గత గురువారం  చదును చేశాడు. గతంలో కూడా ఈ భూమిని అదే మాజీ కౌన్సిలర్​ ఆక్రమించుకునేందుకు యత్నిస్తే అధికారులు గుర్తించి ‘ఇది గవర్నమెంట్​ల్యాండ్’ అని బోర్డు పెట్టారు. కానీ మళ్లీ ఇప్పుడు ఆ భూమిని ఆక్రమించుకునే పనిలోనే అతడు నిమగ్నమయ్యాడు. 

మరో మాజీ కౌన్సిలర్​ 400 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించాడు. ‘ఈ ల్యాండ్​ నాదే’ అంటూ తప్పుడు పత్రాలు సృష్టించి ఏకంగా 76జీవో కింద పట్టాకు దరఖాస్తు చేయడం గమనార్హం. మరి కొందరు ఇప్పటికే మున్సిపాలిటీ నుంచి ఇంటి నెంబర్లు తీసుకొని నిర్మాణాలు చేసుకున్నారు. 

కొత్తగూడెం కార్పొరేషన్​కు కూతవేటు దూరంలోనే ఓ వ్యక్తి తనకున్న పొలిటికల్​ అండదండలతో ఏకంగా గవర్నమెంట్​ స్థలాన్నే ఆక్రమించుకోవడంతో పాటు కమర్షియల్​ నిర్మాణాలు చేశాడు.
కొన్ని చోట్ల డ్రైనేజీ స్థలాన్ని ఆక్రమించుకోవడంతో పాటు నిర్మాణాలు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద నీరంతా రోడ్డుపైనే నిల్చిపోయింది. వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.     నగరంలోని రామా టాకీస్​ ఏరియాలో ఓ ప్రముఖ డాక్టర్​ గవర్నమెంట్​ స్థలంలోనే షెడ్​ వేశాడు. 

నగరంలోన బిజినెస్​ ఏరియా అయిన చిన్న బజార్​ నుంచి పెద్ద బజార్​ వరకు గల్లీలు సగం మేర ఆక్రమణకు గురయ్యాయి. 

ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం.. 

గవర్నమెంట్​ స్థలాలను ఆక్రమించుకునే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం. కూలీలైన్​లో ఆక్రమణకు గురవుతున్న విషయంపై టౌన్​ ప్లానింగ్​ ఆఫీసర్లను పంపించి విచారిస్తాం. కార్పొరేషన్​కు సమీపంలో గవర్నమెంట్​ స్థలాన్ని ఆక్రమించిన విషయంతో పాటు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినవారికి  ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. వారి నుంచి స్పందన లేదు. మరోసారి నోటీస్​ ఇచ్చి, అవసరమైతే కూల్చివేస్తాం. – సుజాత,  కొత్తగూడెం కార్పొరేషన్​ కమిషనర్​