విశాఖపట్నం: చిన్న టార్గెట్ను ఈజీగా ఛేదించిన ఇంగ్లండ్.. విమెన్స్ వరల్డ్ కప్ లీగ్ దశను విజయంతో ముగించింది. అమీ జోన్స్ (86 నాటౌట్), ట్యామీ బ్యూమోంట్ (40), హీథర్ నైట్ (33) రాణించడంతో.. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై గెలిచింది. దాంతో ఆడిన 7 మ్యాచ్ల్లో 5 విజయాలతో 11 పాయింట్లు సాధించి రెండో ప్లేస్లో నిలిచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 38.2 ఓవర్లలో 168 రన్స్కే ఆలౌటైంది. 21 రన్స్ వద్ద సుజీ బేట్స్ (10) ఔట్ కాగా, జార్జియా ప్లిమెర్ (43), అమెలియా కెర్ర్ (35) రెండో వికెట్కు 68 రన్స్ జోడించి ఇన్నింగ్స్ను ఆదుకున్నారు. మిడిలార్డర్లో కెప్టెన్ సోఫీ డివైన్ (23) మోస్తరుగా ఆడినా, బ్రూక్ హాలీడే (4), మ్యాడీ గ్రీన్ (18), ఇసాబెల్లా గాజె (14), జెస్ కెర్ర్ (10), రోస్మేరి మైర్ (0), లీ తహుహు (2) నిరాశపర్చడంతో కివీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.
లిన్సీ స్మిత్ 3, సివర్ బ్రంట్, అలైస్ క్యాప్సీ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఛేజింగ్లో ఇంగ్లండ్ 29.2 ఓవర్లలో 172/2 స్కోరు చేసి నెగ్గింది. బ్యూమోంట్తో తొలి వికెట్కు 75 రన్స్ జోడించిన అమీ జోన్స్.. హీథర్ నైట్తో రెండో వికెట్కు 83 రన్స్ జత చేసింది. సోఫీ డివైన్, లీ తహుహు చెరో వికెట్ పడగొట్టారు. జోన్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్తో కివీస్ కెప్టెన్ సోఫీ డివైన్ వన్డేలకు గుడ్బై చెప్పింది.
