కేసీఆర్​ను దేవుడిలా చూపెట్టాలి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

కేసీఆర్​ను దేవుడిలా చూపెట్టాలి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్  రావు

జనగామ, వెలుగు: కంటి వెలుగు సక్సెస్​ కోసం సర్పంచ్​లు ప్రతి ఇంటికెళ్లి, జనాల్లో అవగాహన పెంచి కేసీఆర్ ను దేవుడిలా చూపెట్టాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్  రావు అన్నారు. కంటి వెలుగు శిబిరం ఉన్న రోజుల్లో సదరు చోట్ల ఈజీఎస్​ పనులు బంద్​ పెట్టి, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. జనగామ కలెక్టరేట్​లో గురువారం కంటి వెలుగు పథకం అమలుపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు.

 అందరూ కలిసికట్టుగా పనిచేసి కంటి వెలుగు రెండో దశ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జనగామను నంబర్​ వన్​ గా నిలపాలని మంత్రి సూచించారు. అందు కోసం ఈనెల 12 లోపు మండలాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలన్నారు.  తదుపరి సర్పంచ్​లు తమ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించడంతో పాటుగా ప్రతి ఇంటికెళ్లి అవగాహన కల్పించాలన్నారు. కంటి పరీక్షలకు సంబంధించి ఏరోజు, ఏ గ్రామంలో శిబిరం ఉంటుందనే సమాచారాన్ని మందుగానే ప్రచారం చేయాలన్నారు. శిబిరాల వద్ద మౌళిక వసతులను కల్పించాలన్నారు.

ప్రైవేటులో కంటి ఆపరేషన్లకు చర్యలు

ఉమ్మడి వరంగల్​ జిల్లా పరిధిలో ఆపరేషన్​లు అవసరమున్న వారికి ప్రైవేట్​లో కంటి ఆపరేషన్​లు చేయించేందుకు చర్యలు చేపడతామని, మరో నాలుగైదు రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వస్తుందని మంత్రి దయాకర్​ రావు తెలిపారు. ఈ విషయంపై ప్రైవేటు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. జనగామ జిల్లాలో గతంలో 4 లక్షల మందికి కంటి పరీక్షలు చేయగా ఇప్పుడు 6 లక్షల మందికి టార్గెట్ పెట్టుకున్నామన్నారు. జిల్లాకు ఏడువేల రీడింగ్ గ్లాసెస్ వచ్చాయన్నారు.