
- వెల్లడించిన ప్రపంచ బ్యాంకు
భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని ప్రపంచ బ్యాంక్ తాజా రిపోర్ట్ వెల్లడించింది. 2011–12లో 34.44 కోట్ల మంది నిరుపేదలు ఉండగా, 2022-23 నాటికి వీరి సంఖ్య 7.54 కోట్లకు తగ్గింది. దీంతో దేశంలో పేదరిక రేటు 5.3 శాతానికి పడిపోయింది. దాదాపు 26.9 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంక్ తెలిపింది
న్యూఢిల్లీ: మనదేశంలో కటిక దారిద్ర్యం (ఎక్స్ట్రీమ్పావర్టీ) గణనీయంగా తగ్గిందని ప్రపంచబ్యాంకు రిపోర్టు వెల్లడించింది. 2011–-12లో ఇది 27.1 శాతం నుంచి 2022–--23 సంవత్సరంలో గణనీయంగా 5.3 శాతానికి తగ్గింది. 2011--–12లో 34.44 కోట్ల మంది నిరుపేదలు ఉండగా, 2022--–23 నాటికి వీరి సంఖ్య 7.54 కోట్ల మందికి తగ్గింది. ఈమధ్య కాలంలో తన దారిద్య్ర రేఖ కొలమానాన్ని రోజుకు మూడు డాలర్లకు పెంచింది. ప్రపంచబ్యాంకు రిపోర్ట్ ప్రకారం.. భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది కాబట్టి, పేదరికాన్ని కొలవడానికి గతంలో వాడిన డాలర్ల కంటే ఇప్పుడు ఎక్కువ డబ్బు (రోజుకు 3 డాలర్లు) అవసరం అవుతుంది. ఈ కొత్త లెక్క ప్రకారం, భారతదేశంలో దాదాపు 5.3 శాతం మంది ప్రజలు పేదరికంలో ఉన్నారని తేలింది.
2017– 2021 మధ్య భారతదేశ ద్రవ్యోల్బణ రేటును బట్టి ఈ లెక్కలను సవరించింది. 2021 ధరల ప్రకారం పేదరికం కొలమానం ఒకరికి రోజుకు 2.15 డాలర్లు ఉండేది. ఇంత కంటే తక్కువ సంపాదించే నిరుపేదలు అవుతారు. ఇప్పుడు దానిని మూడు డాలర్లకు పెంచింది. అంటే గతంలో ఉన్న 2.15 డాలర్ల కంటే ఇది 15 శాతం ఎక్కువ. 2017 నుంచి 2021 వరకు ధరలు పెరగడమే ఇందు కారణం. గతంలో 2.15 డాలర్లతో కొనే వస్తువులను ఇప్పుడు కొనాలంటే ఎక్కువ డబ్బు అవసరం. అందుకే దారిద్ర్య రేఖను పెంచారు. మనదేశంలో గత ఏడాది 54,695,832 మంది రోజుకు మూడు డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవించారు. కాబట్టి 2024లో రోజుకు మూడు డాలర్ల వద్ద పేదరికం రేటు 5.44 శాతంగా ఉంది.2011–-12 నుంచి 2022–-23 మధ్య తీవ్ర పేదరికం రేటు 16.2 నుంచి 2.3 శాతానికి తగ్గింది.
మేలు చేసిన సంక్షేమ పథకాలు
ఉచిత, సబ్సిడీ ఆహార బదిలీలు పేదరిక తగ్గింపుకు తోడ్పడ్డాయి. గ్రామాలు, పట్టణాల మధ్య పేదరిక అంతరం తగ్గింది. అత్యధిక జనాభా కలిగిన ఐదు రాష్ట్రాల్లోనే 54 శాతం మంది నిరుపేదలు ఉన్నారని వెల్లడయింది. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశ వాస్తవ జీడీపీ కరోనా ముందు స్థాయి కంటే దాదాపు 5 శాతం తక్కువగా ఉంది. ప్రస్తుత ప్రపంచ అనిశ్చితులు పరిష్కారమైతే, 2027–-28 నాటికి వృద్ధి పరిస్థితులు చక్కబడతాయి. పెరిగిన వాణిజ్య ఉద్రిక్తతలు భారతదేశ ఎగుమతులకు డిమాండ్ను తగ్గిస్తాయి.
పెట్టుబడులు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2026–-28 ఆర్థిక సంవత్సరం మధ్య భారతదేశ కరెంట్ అకౌంట్ లోటు, మన దేశ మొత్తం ఆర్థిక ఉత్పత్తి (జీడీపీలో)లో సగటున 1.2 శాతం వరకు ఉండవచ్చు. విదేశీ మారక నిల్వలు జీడీపీలో 16 శాతం స్థిరంగా ఉండవచ్చు. 2011–-12, 2022–-23 మధ్య దశాబ్దంలో భారతదేశం 17.1 కోట్ల మందిని తీవ్ర పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చింది. గ్రామీణ తీవ్ర పేదరికం 18.4 శాతం నుంచి 2.8 శాతానికి, పట్టణ ప్రాంతం 10.7 శాతం నుంచి 1.1 శాతానికి తగ్గింది. గ్రామీణ- పట్టణ అంతరాన్ని 7.7 నుంచి 1.7 శాతం పాయింట్లకు
తగ్గిందని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ వెల్లడించింది.