- అధికారుల నిర్లక్ష్యంతో పొలం మరొకరి పేరు నమోదు
- సరిచేయమంటూ అధికారులచుట్టూ తిరిగి విసిగి వేసారి ఆత్మహత్య
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
ఖమ్మం: జిల్లాలో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలాన్ని తన పేరుమీద మార్చమంటూ.. కింది నుండి పై వరకు అధికారుల చుట్టూ తిరిగి.. గ్రామ పెద్దలను బతిమాలుకున్నా.. పని కుదరకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫలించక తుదిశ్వాస విడువగా.. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు.
ధరణి గురించి గొప్పలు ప్రభుత్వం చెప్పుకుంటుంటే.. అధికారులు ప్రభుత్వానికి తూట్లు పొడిచేలా వ్యవహరించారు. ఓ బక్కరైతు పొలాన్ని అధికారులు నిర్లక్ష్యంతో వేరొకరి పేరున నమోదు చేశారు. విషయం తెలుసుకున్న రైతు లబోదిబో మంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. నెలల తరబడి తన వ్యవసాయ భూమి తన పేరున నమోదు చేయమంటూ వీఆర్ ఓ నుంచి మొదలు జిల్లా కలెక్టర్ వరకు కాళ్లరిగేలా తిరిగినా పని కాలేదు. గ్రామ పెద్దలకు తెలిపినా వారి సహకారంతో ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మనస్తాపానికి గురైన రైతు చివరకు ఆత్మహత్యాయత్నం చేయగా.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన చనిపోతే... బయటకు పొక్కకుండా జాగ్రత్తపడినా... ఆలస్యంగా గురువారంవెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతోంది.