
గద్వాల, వెలుగు: సీడ్ పత్తి పంటతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో సీడ్ కంపెనీలతో రైతు కమిషన్ మీటింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ఆర్గనైజర్ల వ్యవహారంతో సీడ్ కంపెనీలు బద్నాం అవుతున్నాయని చెప్పారు. సీడ్ కంపెనీలు రైతులను దృష్టిలో పెట్టుకొని, వారి సంక్షేమం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సీడ్ ఉత్పత్తి వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే విషయంలో సీడ్ కంపెనీలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సీడ్ కంపెనీలు ఆర్గనైజర్లతో వ్యాపారం చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. సీడ్ కంపెనీలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకుండా, రైతుల గురించి ఆలోచించాలని సూచించారు. ఈ మీటింగ్ లో కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాములు నాయక్, భవాని రెడ్డి, కమిషన్ సలహాదారులు నరసింహారెడ్డి, రామానుజన్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.