ఎట్టకేలకు భద్రాద్రిలో ఎన్నికల సందడి.. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి ఇక్కడ ఎలక్షన్

ఎట్టకేలకు భద్రాద్రిలో  ఎన్నికల సందడి.. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి ఇక్కడ ఎలక్షన్
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఇక్కడ ఎలక్షన్​
  • ఆశావహుల్లో ఆనందం..  రసవత్తరంగా మారుతున్న రాజకీయం

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం పట్టణంలో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఇక్కడ ఎన్నికలు జరుగుతుండటంతో ఆశావహుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 

ఇప్పటివరకు జరిగింది ఇలా.. 

భద్రాచలం మండల పరిషత్​కు రాష్ట్రవిభజనకు ముందు 2014లో చివరిసారి ఎన్నికలు జరిగాయి. 13 ఎంపీటీసీ స్థానాలతో పోటీ జరిగింది. ఆ పాలకవర్గం పదవీ కాలం 2018తో ముగిసింది. జడ్పీటీసీగా ఎటపాకకు చెందిన గోడేటి రవికుమార్ గెలిచారు. ఎన్నికల అనంతరం జరిగిన రాష్ట్ర విభజనలో భద్రాచలం టౌన్​ మినహా మండలం అంతా పోలవరం ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేశారు. గవువు ముగిసిన తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించనే లేదు. దీనికి తోడు మండల పరిషత్​ను నూతన మండలం ఆళ్లపల్లికి మార్చేశారు. 

అయితే కాంగ్రెస్​ సర్కారు వచ్చాక తిరిగి భద్రాచలం మండల పరిషత్​ను పునరుద్ధరించింది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి మండల పరిషత్​ ఎన్నికలు జరుగనున్నాయి. 2014లో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఈసారి వాటిని  14కు పెంచారు. జడ్పీటీసీ బీసీ మహిళకు, ఎంపీపీని గిరిజన మహిళకు కేటాయించారు. ఎంపీటీసీ స్థానాలు 14 కాగా, ఇందులో ఏడు గిరిజనులకు, మరో ఏడు అన్​ రిజర్వ్డ్  గా ప్రకటించారు. 

మేజర్​ గ్రామపంచాయతీలోనూ అలాగే... 

భద్రాచలం మేజర్​ గ్రామపంచాయతీకి కూడా ఇదే తరహాలో రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఎన్నికలను నిర్వహిస్తున్నారు. గతంలో మున్సిపాలిటీగా, టౌన్​షిప్​గా, మూడు గ్రామపంచాయతీలుగా ఎన్నో మలుపులు తిరిగి చివరకు మేజర్​ పంచాయతీగా ప్రకటించారు. ఈ విచిత్ర పరిణామాల మధ్య ఎట్టకేలకు ఎన్నికలకు లైన్​ క్లియర్​ చేశారు. 2013లో ఏర్పడిన పాలకవర్గం 2018తో ముగిసింది. సర్పంచ్​అభ్యర్థి ఎస్టీ జనరల్​కు రిజర్వేషన్​లో కల్పించారు. 

20 వార్డుల్లో 10 ఎస్టీ మహిళలకు కేటాయించగా, ఐదు వార్డులు జనరల్​మహిళలకు, మరో ఐదు జనరల్​కు రిజర్వేషన్లు కల్పించారు. కాగా, భద్రాచలం జడ్పీటీసీ ఎన్నిక ఆసక్తికరంగా మారనుంది. బీసీ మహిళకు రిజర్వేషన్​లో కేటాయించడంతో ఆశావహులు తెరపైకి వస్తున్నారు. ఆయా పార్టీల హైకమాండ్స్​తో చర్చలు జరుపుతున్నారు. జనరల్ కావడంతో పోటీ రసవత్తరంగా మారనుంది.