హైదరాబాద్, వెలుగు: ఎడతెరిపి లేకుండా పడుతోన్న వానలతో గ్రేటర్లో సీజనల్ వ్యాధులు రోజురోజుకి పెరిగి పోతున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్లతో సిటీ జనం హాస్పిటల్స్ బాట పడుతున్నారు. చలిజ్వరం, వాంతులు, విరేచనాలు, జలుబు, దగ్గు సమస్యలతో డాక్టర్లను సంప్రదిస్తున్నారు. గత వారంతో పోలిస్తే ఈ నాలుగైదు రోజులుగా హాస్పిటళ్లలో ఓపీ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే సిటీ వ్యాప్తంగా ఉన్న 89 యూపీహెచ్సీలు, 152బస్తీ దవాఖానాల్లోని ఓపీకి 20 వేల 589 వచ్చినట్లు డీహెచ్ఎంవో డాక్టర్ వెంకటి తెలిపారు. ఇందులో 2,476 ఫీవర్ కేసులున్నాయన్నారు.
వారం రోజులుగా..
వారం కిందటి వరకు ఫీవర్ హాస్పిటల్లో 350 నుంచి 400 వరకు ఓపీ పేషెంట్లు వచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 600కు పెరిగిందని అక్కడి డాక్టర్లు చెప్తున్నారు. వీటిలో డెంగీ, గ్యాస్ట్రో ఎంటెరిటిస్ కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఉస్మానియాలో మాత్రం గతంతో పోలిస్తే ప్రస్తుతం ఓపీ తగ్గినట్లు సూపరింటెండెంట్ బి. నాగేందర్ తెలిపారు. వారం రోజుల వరకు 2500 ఓపీ ఉంటే మంగళవారం 953మంది ఓపీకి వచ్చారన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని చెప్పారు. ఈ నెలలో 6 డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో గతం వారం 1,683 మంది ఓపీకి వస్తే సోమవారం 1488, మంగళవారం 915 మంది వచ్చినట్లు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. గత నెల 24 డెంగీ కేసులు, ఈ నెల 6 కేసులు వచ్చాయన్నారు. మరోవైపు బస్తీ దవాఖానాలకు వచ్చే పేషెంట్లు సంఖ్య పెరుగుతోంది. ఇటు బస్తీ దవాఖానల్లో రోజురోజుకి పేషెంట్లు పెరుగుతున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం 100కు పైగా ఓపీ కేసులు నమోదవుతున్నాయి.
అందుబాటులోని ఆస్పత్రులకు..
ప్రస్తుతం సిటీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్లో అధిక సంఖ్యలో సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు, డెంగీ , టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. బస్తీ దవాఖానలు అందుబాటులోకి వచ్చాక పెద్దాసుపత్రులకు వస్తున్న పేషెంట్ల సంఖ్య తగ్గిందని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. బల్దియా పరిధిలో 259 బస్తీ దవాఖానాలు న్నాయి. మాన్ సూన్ సీజన్కు ముందు వరకు ఒక్కో బస్తీ దవాఖానకు రోజుకి 50 నుంచి 60మంది పేషెంట్లు వెళ్లేవారు. ప్రస్తుతం ఒక్కో చోట పేషెంట్ల సంఖ్య వందకు పైనే ఉంటోంది. ఉదయం నుంచే బస్తీ దవాఖానలకు పేషెంట్ల తాకిడి మొదలవుతుందని అక్కడి డాక్టర్లు చెప్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉంటుందని బస్తీ దవాఖానాల డాక్టర్లు చెప్తున్నారు. పేషెంట్లకు బీపీ, బ్లడ్, షుగర్, కొలెస్ట్రాల్ టెస్టులు చేసి కండీషన్ బట్టి ఏరియా హాస్పిటల్కు రెఫర్ చేస్తున్నారు.
అవేర్ నెస్ ప్రోగ్రామ్స్..
సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య శాఖ సిబ్బంది బస్తీల్లో హెల్త్ క్యాంప్లు, అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ చేపడుతున్నారు. వర్షాల వల్ల కలుషిత నీరు వచ్చే అవకాశం ఉన్నందున జనాలు వేడి చేసిన నీళ్లను తాగాలని వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. వైరల్ ఫీవర్లు ఎక్కువగా నమోదవుతున్నాయని జనాలు అలర్ట్గా ఉండాలని సూచించారు. డెంగీ నివారణకు బల్దియా ఫాగింగ్ చేస్తోందని, వైద్యారోగ్యశాఖ సిబ్బంది బస్తీల్లో అవేర్ నెస్ కల్పిస్తున్నట్లు తెలిపారు. బస్తీ దవాఖానాల్లోనూ అన్ని టెస్టులు అందుబాటులో ఉంచామన్నారు.
ఇంకా పెరగొచ్చు..
వాంతులు, విరేచనాలు, చలి జ్వరాలతో ఎక్కువ మంది వస్తున్నారు. సీజనల్ ఫ్లూ కేసులు పెరిగాయి. గత నాలుగైదు రోజులుగా వానలు పడుతున్నందున ఓపీకి ఎక్కువగా జనాలు రావడం లేదు. అడ్మిట్ అయ్యే పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. వానలు తగ్గాక బ్యాక్టీరియల్ ఫంగల్ డిసీజ్లుపెరిగే అవకాశాలు ఉన్నాయి. వారంలో 5 నుంచి 10 శాతం ఫీవర్ కేసులు పెరిగాయి. మే నెలలో 26, జూన్లో 28 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో ఇప్పటివరకు 10 డెంగీ కేసులను నిర్ధారించాం. జనాలు బయటికెళ్లేటప్పుడు వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటి ఫుడ్ తినొద్దు.
- డా. శంకర్, సూపరింటెండెంట్, ఫీవర్ హాస్పిటల్ పేషెంట్లు పెరిగారు
ఈ మధ్యకాలంలో పేషెంట్లు పెరిగారు. ఇదివరకు రెగ్యులర్గా వచ్చే పేషెంట్ల సంఖ్య 50 నుంచి 60 ఉండేది. వానాకాలం మొదలయ్యాక 90 మంది వరకు వస్తున్నారు. జ్వరం, విరేచ నాలు వంటి లక్షణాలతో ఎక్కువగా వస్తు న్నారు. వారికి టెస్ట్లు చేస్తున్నాం. సీరియస్గా ఉన్న వాళ్లను గోల్కొండ ఏరియా హాస్పిటల్కు రెఫర్ చేస్తున్నాం.
- సువర్ణ, స్టాఫ్ నర్సు, బస్తీ దవాఖాన, షేక్ పేట