
( ‘విధ్వంసం నుంచి వికాసం వైపు..’ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా..) : తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలన సబ్బండ వర్గాలకు పెద్దపీట వేస్తోంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ రాష్ట్రాన్ని వికాసం వైపు కాంగ్రెస్ నడిపిస్తోంది. సబ్బండ వర్గాలకు ఇచ్చిన అభయహస్తం హామీలను నెరవేరుస్తూ ఇంటింటా సౌభాగ్యం నిలిచేలా ఇందిరమ్మ రాజ్యాన్ని అందిస్తోంది.
తెలంగాణ రైజింగ్ పాలనలో రైతులకు, మహిళలకు, యువతకు ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతివ్వడమే కాకుండా బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ సామాజిక న్యాయం చేస్తోంది. రెండు దఫాల కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో జరిగిన విధ్వంసం, అవినీతిని వెలికితీస్తూ జవాబుదారీ పాలన అందించి కాంగ్రెస్ ప్రజల అభిమానాన్ని పొందుతోంది. రాష్ట్రం ఆవిర్భావం నాటికి రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పులకుప్పగా మారింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంది. అధికారం చేపట్టిన రెండోరోజే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడంతో సగటున రోజుకు 37 లక్షల మంది ఆడబిడ్డలు లబ్ధి పొందుతున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో 50 లక్షలకుపైగా కుటుంబాలకు, రూ.500 గ్యాస్ సబ్సిడీతో 40 లక్షలకు పైగా కుటుంబాలకు భారీగా ప్రయోజనం చేకూరుతోంది.
అన్నదాతలకు అభయహస్తం
ఆరోగ్యశ్రీ బీమాను రూ.10 లక్షలకు పెంచి పేదల్లో భరోసా కలిగించింది. బీఆర్ఎస్ డబుల్ బెడ్రూం పేరుతో పేదలను మోసం చేయగా కాంగ్రెస్ మహిళల పేరిట 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించింది. కేసీఆర్ హయాంలో పేదలకు రేషన్ కార్డుల్వికుండా నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 40 లక్షలకు పైగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది.
రాష్ట్రంలో కోటి మందికిపైగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంగా ‘ఇందిరా మహిళా శక్తి’ పథకాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారితకు పెద్దపీట వేస్తోంది. అన్నదాతలకు అభయం హస్తం అందిస్తూ వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ అధిక పాధాన్యతిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.21 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేయడంతో 25 లక్షలకు పైగా రైతులకు లబ్ది కలిగింది. కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పేరిట ఎకరాకు రూ.10 వేలు ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేలు ఇస్తుండడంతో రైతులకు భారీ పెట్టుబడిగా మారింది.
బీఆర్ఎస్ రైతుబంధును రియల్ ఎస్టేట్ భూములు, అన్యాక్రాంతం భూములకు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేయగా, కాంగ్రెస్ వ్యవసాయ యోగ్యతా భూములకే ఇచ్చి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చేసింది. వరి దండగ అని బీఆర్ఎస్ ప్రభుత్వం చెబితే, కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇచ్చింది.
రూ.178 లక్షల కోట్ల పెట్టుబడులు
చివరి పంట వరకు నీరు అందించాలనే లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మరమ్మతులు చేస్తుండడంతో రికార్డు స్థాయిలో 275 లక్షల టన్నుల ధాన్యాన్ని తెలంగాణ దిగుబడి చేసింది.
బీఆర్ఎస్ ‘ధరణి’ పోర్టల్ తీసుకొచ్చి భూదందాలు, అక్రమాలకు తెరదీయగా కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేస్తూ కొత్తగా ‘భూభారతి’ ప్రవేశపెట్టడంతో అన్ని వర్గాలు ఆనందంగా ఉన్నాయి.
ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ఇంటింటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ పీఠమెక్కాక తమ కుటుంబ సభ్యులకు రాజకీయ పదవులు ఇచ్చుకున్నారు. తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన యువతను నిర్లక్ష్యం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా కాంగ్రెస్ సర్కార్ ఏడాదిన్నరలో భారీగా 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి రికార్డు సృష్టించింది. యువతకు స్వయం ఉపాధి కోసం ‘రాజీవ్ యువ వికాస్’ ద్వారా 5 లక్షల మందికి ఆర్థికసాయం చేసే పథకం ప్రారంభించింది.
తెలంగాణకు పరిశ్రమలు వచ్చేలా ఫ్యూచర్ సిటీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడంతో దావోస్ వేదికగా రాష్ట్రానికి రూ.178 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బడుగు, బలహీన వర్గాల సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉంది.
విజయవంతంగా కులగణన
తెలంగాణకు తొలి సీఎంగా దళితుడిని చేస్తామని నమ్మబలికిన కేసీఆర్ తానే అందలమెక్కారు. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 23 శాతానికి తగ్గించిన ఘనచరిత్ర బీఆర్ఎస్ది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో కులగణనను విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా సత్వరమే ఆ ఫలాలు బీసీ వర్గాలకు అందించింది.
విద్య, ఉపాధి, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ఆమోదించిన ప్రభుత్వం, దీన్ని చట్టంగా చేయాలని కోరుతూ కేంద్రానికి పంపింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం పొందేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదు. బాధ్యతగల ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా దాటవేత వైఖరి ప్రదర్శిస్తూ కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు.
దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణకు ఘనత దక్కిందంటే అది కాంగ్రెస్ సామాజిక న్యాయానికి నిదర్శనం. బీసీ బిడ్డను అయిన నేను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తూ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నాను.
బీఆర్ఎస్ అవినీతిపై విచారణ
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో.. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా కార్ రేస్తోపాటు పలు
ప్రభుత్వ పథకాల్లో కూడా వారు పాల్పడిన అవినీతికి అంతేలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వారి అవినీతికి పరాకాష్ట. ఇందులో భాగంగా నిర్మించిన మేడిగడ్డలో నాణ్యత లోపించడంతో ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం ఏర్పడింది.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం, గొర్రెల పంపిణీ ఇలా వివిధ ప్రభుత్వ పథకాలు బీఆర్ఎస్ నేతలకు,కార్యకర్తలకు అవినీతిగా మారాయి. తమ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలతో పాటు సొంతపార్టీ వారి ఫోన్లను కూడా అధికారులపై ఒత్తిడి తెచ్చి ట్యాపింగ్ చేయించారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పేరుతో నిబంధనలకు వ్యతిరేకంగా ఫార్ములా కార్ రేస్ నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు చేసిన భూ కబ్జాలకు కొదవే లేదు. కేసీఆర్ పాలనలో పలు అవినీతి కార్యక్రమాలపై విచారణలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలిచ్చింది.
తెలంగాణపై మోదీ సర్కారు నిర్లక్ష్యం
పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ రాష్ట్ర గేయాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ప్రకటించలేదు. రాష్ట్ర గేయం ‘జయ జయహే తెలంగాణ’ రచయిత అందెశ్రీని ఘనంగా గౌరవించుకున్నాం. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచేలా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరించుకున్నాం.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో బతుకమ్మ పండుగను కేసీఆర్ తనయ కవితకు అన్ని అధికారాలు ఇస్తూ ఆమె నేతృత్వంలోని తెలంగాణ జాగృతికే పరిమితం చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాలకు చేరువచేసి, పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అధిక శాతం ఏడాదిన్నర కాలంలోనే అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోంది. మోదీ సర్కారు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమనే నిర్లక్ష్యంతో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులను, పథకాలను కేటాయించడం లేదు.
కేంద్రం తోడ్పాటు అందించడంలో నిర్లక్ష్యం చూపుతుంటే రాష్ట్ర బీజేపీ మంత్రులు, ఎంపీలు, నేతలు పట్టనట్టు వ్యవహరించడం దురదృష్టకరం. ఏడాదిన్నరగా ఇందిరమ్మ రాజ్యం అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసాలను ఒక్కొక్కటీ చక్కదిద్దుతూ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తోంది. 560 రోజులకు పైగా కాంగ్రెస్ ప్రజా పాలనలో తెలంగాణలో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నాయి. తెలంగాణ రైజింగ్ పాలనలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ- -- బి.మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
-బి.మహేశ్ కుమార్ గౌడ్,టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ-