
పిల్లల కడుపులో క్రిముల వల్ల (పొట్టలో నట్టలు) కలిగే అనారోగ్య సమస్యలను అంతం చేయుటకు భారత ప్రభుత్వం 2015 సం. నుంచి ‘జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం (ఎన్.డి.డి.)’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆనాటి నుంచి ప్రతి ఏటా రెండుసార్లు ఫిబ్రవరి, ఆగస్టు మాసాలలో ఆరు నెలలకోసారి అన్ని రాష్ట్రాలలో డీవార్మింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తూ 1సం. నుండి 19 సం.ల వయసు పిల్లలందరికీ నులిపురుగుల నిర్మూలన మాత్రలు ‘ఆల్బెండజోల్ టాబ్లెట్స్’ వేయడం జరుగుతుంది.
పిల్లలు తరచుగా కడుపునొప్పితో గానీ, కాళ్ళు ముఖం ఉబ్బటం గానీ, ఆకలి మందగించడం, నీరసంగా, మందకొడిగా, బరువు తగ్గడం, రక్తహీనత, మలద్వారం చుట్టూ దురద మొదలగు ఏదైనా ఒక లక్షణంతో శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతుంటే కడుపులో నట్టలు ఉన్నట్టు అనుమానించవచ్చు.
నులిపురుగు వేటి ద్వారా వ్యాపిస్తుంది?
పరిసరాలు పరిశుభ్రంగా లేని ప్రాంతాలలో మానవ మలంలో ఉన్న హెల్మిన్తీస్ పరాన్నజీవుల గుడ్ల ద్వారా మట్టి కలుషితం అయి ‘మట్టి ద్వారా సంక్రమించే హెల్మిన్తీస్’ వ్యాప్తి చెందుతాయి. ఆరుబయట చెప్పులు లేకుండా వట్టి కాళ్ళతో మట్టిలో ఆడుకోవడం. అపరిశుభ్రమైన సురక్షితం కాని నీరు, ఆహారం తీసుకోవడం. భోజనం చేసే ముందు, మలవిసర్జన తర్వాత చేతులు సబ్బు నీటితో కడుక్కోపోవుట.
బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయుట. పెరిగిన గోళ్లను కత్తిరించక పోవడం. వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పారిశుధ్యం లోపించడం. అపరిశుభ్రమైన ఆకు కూరలు, కాయగూరలు, పండ్లు తీసుకోవడం ద్వారా నులి పురుగులు నోటిద్వారా లేదా అరికాళ్ళ చర్మం ద్వారా సంక్రమిస్తాయి.
ఎక్కడ మాత్రలు వేస్తారు?
11 ఆగస్టు 2025 రోజున అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేయబడిన1 నుంచి 5సం.ల వయస్సు గల చిన్నారులకు, 6 నుంచి 19 సం.ల వయస్సు గల బడి బయట పిల్లలకు అంగన్వాడీ/ఆశా కార్యకర్తలు ఆల్బెండజోల్ మాత్రలు వేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, మదర్సాలలో , కాలేజీలలో నమోదు చేయబడిన పిల్లలందరికీ ఎన్.డి.డి. రోజు ఏ.ఎన్.ఎం.లు, ఉపాధ్యాయులు ఆల్బెండజోల్ మాత్రలు వేస్తారు. అనాథ ఆశ్రమాలు, చైల్డ్ కేర్ సెంటర్లు, అన్ని ప్రదేశాలలో 1 నుంచి 19 సం. వయసున్న పిల్లలకు ఆరోగ్య సిబ్బంది మాత్రలు వేస్తారు.
నులిపురుగుల ప్రభావం ఎక్కువగా ఉన్న పిల్లలలో ఈ మాత్ర వేసుకున్న తర్వాత కొందరికి వికారం, స్వల్ప కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు కలగవచ్చు. కంగారుపడాల్సిన పనిలేదు. వెంటనే స్థానిక వైద్యారోగ్య సిబ్బందికి తెలియజేయాలి. పిల్లలు ఈ మాత్రను డైరెక్టుగా మింగకుండా బాగా నమిలి మింగేవిధంగా చూడాలి.
ఆల్బెండజోల్ మాత్రల మోతాదు
1 నుంచి 2 సం.ల చిన్నారులకు ఆల్బెండజోల్ సగం మాత్ర (200 mg) రెండు స్పూన్ల మద్య నలిపి, నీటితో కలిపి మింగిస్తారు. 2 నుంచి 3 సం.ల పిల్లలకు పొడి చేసిన ఒక పూర్తి మాత్ర (400 ఎమ్.జి.), 3 నుంచి 19 సం.ల వయసు పిల్లలు ఆల్బెండజోల్ మాత్ర (400 ఎమ్.జి.) భోజనం చేసిన తర్వాత నమిలి నీటితో మింగాలి. జబ్బులున్న వారు, దీర్ఘకాలికంగా మందులు వాడుతున్న పిల్లలు ఈ మాత్రలు వేసుకోరాదు. ఖాళీ కడుపుతో మాత్రలు వేసుకోరాదు.
నులి పురుగులు రాకుండా నివారణ చర్యలు
బయటకు వెళ్లినప్పుడు చెప్పులు ధరించాలి. సురక్షితమైన నీరు, పరిశుభ్రమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. భోజనం, ఇతర ఆహార పదార్థాలు తినే ముందు, మలవిసర్జన తర్వాత చేతులు సబ్బు నీటితో కడుక్కోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకుండా, మరుగు దొడ్లని వాడాలి. పెరిగిన గోళ్లను కత్తిరించి, శుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా కడిగిన ఆకు కూరలు, కాయగూరలు, పండ్లు తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా నులి పురుగులు రాకుండా నివారించవచ్చు.
- నాశబోయిన నరసింహ, ఆరోగ్య విస్తరణ అధికారి-