హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో గతంలో పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలని హైకోర్టు ఆదేశించింది. పాత తీర్పును పక్కనబెట్టి, తిరిగి విచారణ చేసి తాజాగా ఉత్తర్వులివ్వాలని కింది కోర్టును ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆరో నిందితుడిని మేజర్గా పరిగణిస్తూ పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని నిందితుడి తల్లి వేసిన పిటిషన్ను జస్టిస్అనుపమ చక్రవర్తి విచారించి ఉత్తర్వులు జారీ చేశారు.
2022 మే 28న ఫ్రెండ్స్తో కలిసి ఆమ్నేసియా పబ్ కేసులో పార్టీకి వెళ్లిన తనపై గ్యాంగ్రేప్ జరిగిందని బాధిత బాలిక మీడియా ఎదుట ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడు సాదుద్దీన్తో పాటు ఐదుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే, నలుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించాలని పోలీసుల అభ్యర్థనను పోక్సో కోర్టు 2022 సెప్టెంబర్ 30న ఆమోదించింది.
ఈ కేసులో ఆరో నిందితుడైన తన కుమారుడు మైనర్ అని, ఆ తీర్పుపై స్టే ఇవ్వాలని అతని తల్లి వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ పూర్తి చేసింది. పోక్సో కోర్టు ఆర్డర్ కాపీతోపాటు ఆ తీర్పునకు ఎంచుకున్న ఆధారాలు కూడా అందజేయాలని కోరారు. ఎలాంటి ఆధారాలతో మేజర్లుగా పేర్కొన్నది రిపోర్టు ఇవ్వాలని నిందితుల అభ్యర్థనల రిట్పై హైకోర్టు విచారణ ముగించింది.