సంక్రాంతి స్పెషల్​: ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా

సంక్రాంతి స్పెషల్​:  ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా

హిందువులు ప్రతి రోజు నిద్రలేవగానే ఇంటి ముందు శుభ్రంగా ఊడ్చి ముగ్గు పెడతారు. ఇక పండుగల సమయంలో అయితే పెద్ద పెద్ద రంగవల్లులు వేసి అందంగా కనిపిస్తాయి. సంక్రాంతి వచ్చిందంటే నెల రోజుల ముందు నుంచి ఇళ్ల ముందు ముగ్గులు వేసి వాటిని పూలతో అందంగా అలంకరిస్తారు. ఎవరు ఎంత పెద్ద అందమైన ముగ్గు వేశారో చూడటం కోసం అమ్మాయిలు వీధుల వెంట తిరుగుతూ సందడి చేస్తారు. భోగి రోజు... భోగి కుండ ముగ్గు... సంక్రాంతి మరుసటి రోజు వేసే రథం ముగ్గు చాలా ఫేమస్.

అందమైన రంగవల్లులు ఇంటి ముందు వేయడం వల్ల ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. శుక్రవారం ముగ్గు, శని వారం ముగ్గు, చుక్కల ముగ్గు, మెలికల ముగ్గు అంటూ రకరకాల ముగ్గుల డిజైన్లు ఉంటాయి. ఒక్కోదానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. దేవతలు, దేవుళ్ళని ఆహ్వానిస్తూ ముగ్గు వేస్తారని చెబుతారు. శుక్రవారం పూట ముగ్గు వేస్తే కొంతమంది మహిళలు తప్పకుండా పసుపు, కుంకుమతో అలంకరిస్తారు.

ముగ్గు ఎందుకు వేయాలో పురాణ కథ

ముగ్గు వేయడం అనేదాని వెనుక ఒక చిన్న పిట్ట కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇతిహాసాల ప్రకారం ఒక రాజు తన కుమారుడి చనిపోతాడు. దీంతో రాజు తన కుమారుడిని బతికించమని సృష్టికర్త బ్రహ్మ దేవుడిని వేడుకున్నాడు. బ్రహ్మ దేవుడి అనుగ్రహం కోసం అతను చాలా కాలం పాటు తపస్సు చేశాడు. చివరికి కనికరించి బ్రహ్మదేవుడు అతడికి ప్రత్యక్షమై రాజు కొడుకిని బతికించడానికి అంగీకరించాడు.

అప్పుడు బ్రహ్మ దేవుడు నేలపైన బియ్యపు ముద్దతో కుమారుడి బొమ్మ గీయమని రాజుకి చెప్తాడు. బ్రహ్మ చెప్పినట్టుగా రాజు బొమ్మ వేస్తాడు. అప్పుడు బ్రహ్మ దేవుడు తిరిగి అతడి కొడుక్కి ప్రాణం పోస్తాడు. అక్కడి నుంచి ముగ్గు ఆచారంగా మారింది. ముగ్గు అదృష్టం, శ్రేయస్సు తీసుకొస్తుందని నమ్ముతారు. అందుకే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేయడం మొదలు పెట్టారు. ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం.

ముగ్గుల అర్థాలు

ముగ్గు వేసే ముందు మొదటగా రెండు పొడవు గీతలు గీస్తారు. అలా చేయడం వెనుక ఒక అర్థం ఉంది. ఆ రెండు అడ్డ గీతలు ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండ అడ్డుకుంటుంది. ముగ్గు వేసిన తర్వాత చుట్టూ నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తారు. అది శుభకార్యం సందర్భంలో చేస్తారు.

దేవతలని పూజించేటప్పుడు ఇంట్లో ఉన్న పూజ గది దగ్గర కూడా ముగ్గు వేస్తారు. దేవతల పూజ చేస్తున్నప్పుడు దైవ విగ్రహం పెట్టె పీట దగ్గర చిన్న ముగ్గు వేసిన నాలుగు వైపుల రెండేసి గీతలు తప్పకుండా గీయయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా వేసే ముగ్గు దుష్టశక్తులు దరి చేరకుండా వేస్తారు.

ఒక్కొక్క ప్రదేశంలో ముగ్గుని ఒక్కో విధంగా పిలుస్తారు. కొందరు రంగవల్లికలని రంగోలి లేదా ముగ్గు లేదా పూకళం లేద అల్పన అని పిలుస్తారు. అది మాత్రమే కాదు ప్రాంతాల వారిగా ముగ్గులో కూడా తేడా ఉంటుంది. కొందరు బియ్యం పిండితో ముగ్గు వేస్తే మరికొందరు ముగ్గు పిండితో వేస్తారు. కేరళ వాళ్ళు ముగ్గుని పూకళం అంటారు. అంటే పువ్వులు, ఆకులతో వేసేది అని అర్థం. పశ్చిమ బెంగాల్ లో అల్పన అంటారు. ఇది బియ్యపు పిండితో వేస్తారు. దక్షిణ భారతదేశంలో ముగ్గు పిండిలో ఇసుక కలిపి కూడా వేస్తారు. ప్రాంతాలు వేరైనా ముగ్గు వేయడం వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం ఒక్కటే.