- కాపాడిన హైడ్రా, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది
మాదాపూర్, వెలుగు: మద్యం తాగి భార్యతో గొడవ పెట్టుకున్న ఓ వ్యక్తి కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా హైడ్రా, పోలీస్ సిబ్బంది కాపాడారు. మెదక్ జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన రాంరెడ్డి(25) మాదాపూర్ మైండ్స్పేస్ బిల్డింగ్ నెం.21లో అఫీస్బాయ్గా పనిచేస్తూ స్థానికంగా నివాసముంటున్నాడు. శుక్రవారం మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో ఆమె కుమార్తెను వెంటపెట్టుకొని ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆ తరువాత రాంరెడ్డి సాయంత్రం 6.30 గంటల సమయంలో కేబుల్ బ్రిడ్జి మీదకు వచ్చి దుర్గం చెరువులో దూకేందుకు ప్రయత్నించాడు.
అదే సమయంలో హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు కేబుల్ బ్రిడ్జి మీద వర్షపు నీరు నిలవకుండా రంధ్రాలను శుభ్రం చేస్తున్నారు. రాంరెడ్డి బ్రిడ్జి మీది నుంచి దూకుతున్నాడని గమనించి చాకచక్యంగా పట్టుకున్నారు. మాదాపూర్ ట్రాఫిక్ ఆర్ఎస్ఐ అరుణ్కు అప్పగించగా కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
