తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. శనివారం ( మార్చి 14 ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న ఈ పరీక్షల కోసం పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీపీ సుధీర్ బాబు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రశాంతంగా పరీక్షలు రాసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ ఏడాది ఫ్యూచర్ సిటీ పరిధిలో సుమారు 15 వేల 764 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని... పరీక్షా సమయం ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీగా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు సుధీర్ బాబు.
ప్రశ్నపత్రాల భద్రత:
పోలీస్ స్టేషన్ల నుండి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తరలించే సమయంలో, తిరిగి జవాబు పత్రాలను పంపే సమయంలో ప్రత్యేక ఎస్కార్ట్ బృందాలు రక్షణగా ఉంటాయని తెలిపారు సీపీ సుధీర్ బాబు.
నిషేధిత వస్తువులు:
పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, టాబ్లెట్లు, స్మార్ట్ వాచ్లు, పెన్ డ్రైవ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావడం పూర్తిగా నిషేధమని తెలిపారు.
సెక్షన్ 163 అమలు:
పరీక్షా కేంద్రాల పరిసరాల్లో గుంపులుగా చేరడాన్ని నిరోధించడానికి BNSS సెక్షన్ 163 (పూర్వపు 144 సెక్షన్) కింద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు.
జిరాక్స్ సెంటర్లపై నిఘా:
పరీక్షలు జరిగే సమయంలో పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పేపర్ లీకేజీ పుకార్లను అరికట్టడానికి స్పెషల్ స్క్వాడ్స్, మఫ్టీ పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలని అన్నారు.
విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ట్రాఫిక్ విభాగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మహేశ్వరం, షాద్ నగర్ మరియు చేవెళ్ల జోన్ల నుండి ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగిందని... ఎక్కడైనా అక్రమాలు లేదా మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పోలీసులకు సహకరించి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు సీపీ సుధీర్ బాబు.
