బీజేపీ గెలిస్తే కేసీఆర్ తన తప్పుడు నిర్ణయాలపై ఆలోచిస్తాడు

బీజేపీ గెలిస్తే కేసీఆర్ తన తప్పుడు నిర్ణయాలపై ఆలోచిస్తాడు
  • ఒకవేళ గెలిస్తే.. తాను ఏం చేసినా చెల్లుతుందనే పరిస్థితికి వస్తాడు
  • దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే కేసీఆర్ తన తప్పుడు నిర్ణయాలపై ఆలోచించే పరిస్థితికి వస్తాడని.. ఒకవేళ గెలిస్తే మాత్రం తాను ఏం చేసినా చెల్లుతుందనే పరిస్థితికి వస్తాడని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. మంగళవారం హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట, వెంకట్రావుపల్లి, సిరిసేడు గ్రామాల్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ చదువుకున్న మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు కానీ, ఫించన్ల పేరు చెప్పి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. మన బిడ్డలకు ఉద్యోగాలు ఉంటే రెండు వేల పింఛన్లకు ఎదురు చూసే అవసరం ఉండదు అన్నారు. 
కమలం గుర్తుకు ఓటేస్తేనే కేసీఆర్ నేలపైకి వస్తాడు
కమలం గుర్తుకు ఓటేస్తేనే కేసీఆర్ నేలపైకి వస్తాడని, కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ అనుకుంటున్నాడని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. హుజూరాబాద్ ఎన్నికలయ్యాక సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు కూడా ఈటల రాజేందర్ లాంటి పరిస్థితే వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఇక్కడ టిఆర్ఎస్ గెలిస్తే తాను ఏం చేసినా నడుస్తుందనే స్థితికీ కేసీఆర్ వస్తాడు జాగ్రత్త అని హెచ్చరించారు. ఈటల రాజేందర్ గెలిస్తేనే... కేసీఆర్ తన తప్పుడు నిర్ణయాలపై ఆలోచిస్తాడని ఆయన తెలిపారు. పేదల కష్టాలు తెలిసిన ఈటల రాజేందర్ కు ఓటు వేసి అండగా నిలవాలని ఆయన కోరారు.