
- అటాక్ వీడియోలు రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ
- క్యాంపుల్లో జైషే, లష్కరే తోయిబా టెర్రరిస్టులు
- బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ క్యాంప్లో మసూద్ ఇల్లు
- ఆత్మాహుతి దాడులు, బ్రెయిన్ వాష్కు అడ్డా
న్యూఢిల్లీ: పాకిస్తాన్, పీవోకేలోని 9 టెర్రరిస్ట్ క్యాంపులను కేవలం 25 నిమిషాల్లోనే ఇండియా నామరూపల్లేకుండా చేసింది. ఆపరేషన్ సిందూర్లో భాగంగా మొత్తం 24 దాడులు చేసింది. పాకిస్తాన్ కోట్లీలోని 2 టెర్రరిస్ట్ క్యాంపులపై జరిపిన దాడులకు సంబంధించిన వీడియోలను బుధవారం ఆర్మీ రిలీజ్ చేసింది. వీటిలో ఒకటి అబ్బాస్ టెర్రరిస్ట్ క్యాంప్, మరొకటి గోల్పూర్ టెర్రరిస్ట్ క్యాంప్. అబ్బాస్ క్యాంప్ అనేది ఎల్వోసీ నుంచి 13 కిలో మీటర్లు, గుల్పూర్ క్యాంప్ 30 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి.
1 మర్కజ్ సుబాన్: ఆత్మాహుతి దాడులకు ట్రైనింగ్
బహవల్పూర్.. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నది. ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి 100 కిలో మీటర్ల దూరంలో లొకేట్ అయి ఉన్నది. జైషే మహ్మద్కు దీన్ని ఆపరేషనల్ హెడ్క్వార్టర్గా చెప్తుంటారు. పుల్వామాతో పాటు ఇండియాపై జరిగిన చాలా దాడులకు ఇక్కడి నుంచే ప్లాన్ చేశారు. మసూద్ అజార్ సన్నిహితులు ఇక్కడి నుంచే ఆత్మాహుతి దాడులకు ట్రైనింగ్, ప్లానింగ్ చేస్తుంటారు. ఈ క్యాంప్ను జైషే చీఫ్ మసూద్ ఇల్లుగా కూడా ఉపయోగిస్తాడు. ప్రస్తుతం జైషే నంబర్-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే ఉంటున్నారు.
2 మర్కజ్ తోయిబా: ఇంటెలిజెన్స్ పై శిక్షణ
మురిద్కేలోని మర్కజ్ తోయిబా.. ఇండియా బార్డర్ నుంచి 30 కిలో మీటర్ల దూరంలో ఉంది. లష్కరే తోయిబాకు హెడ్ క్వార్టర్గా పని చేస్తున్నది. దాదాపు 82 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. వెయ్యి మంది టెర్రరిస్టులకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ క్యాంప్కు 2000లో అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ రూ.84 కోట్లు డొనేషన్గా ఇచ్చాడు. 26/11 ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఒకడైన అజ్మల్ కసబ్.. ఇక్కడే ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. డేవిడ్ కోల్మన్ హెడ్లీ, తహవ్వూర్ రాణా ఈ కేంద్రాన్ని సందర్శించారు.
3 షవాయ్ నాలా క్యాంప్: జీపీఎస్, వెపన్స్పై ట్రైనింగ్
పీవోకేలోని ముజఫరాబాద్లో, ఎల్వోసీ నుంచి 30 కి.మీ దూరంలో షవాయ్ నాలా క్యాంప్ ఉంది. ఈ క్యాంప్ను హుజైఫా బిన్ యెమెన్, బైత్ ఉల్ ముజాహిద్దీన్ అని కూడా పిలుస్తారు. లష్కరే తోయిబాకు కీలకమైన క్యాంప్ ఇది. లష్కరే కమాండర్ అబు దుజానా దీనికి ఇన్ఛార్జి. లష్కరేలో చేరిన వారిని ఇక్కడ తరుచూ హఫీజ్ సయీద్ వచ్చి కలుస్తుంటాడు. 250 మంది టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లున్నాయి. 26/11 ఉగ్ర దాడుల్లో పాల్గొన్న కసబ్ ఇక్కడ కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు.
4 సైద్నా బిలాల్ క్యాంప్: టెర్రరిస్టుల ట్రాన్స్పోర్ట్ కేంద్రం
ముజఫరాబాద్ లోని సైద్నా బిలాల్ క్యాంప్. పీవోకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇదీ ఒకటి. ముఫ్తీ అస్గర్ ఖాన్ కశ్మీరీ దీనికి చీఫ్గా ఉన్నాడు. ఇండియా నుంచి పారిపోయిన.. ఆసిక్ నెంగ్రూ, జైషే కమాండర్ అబ్దుల్ జిహాదీ కూడా ఈ క్యాంప్ను వాడుకున్నారు. ముజఫరాబాద్ రెడ్ఫోర్ట్కు ఎదురుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేవారికి పాక్ ఎస్ఎస్జీ కమాండోలు ట్రైనింగ్ ఇస్తుంటారు. జమ్మూకాశ్మీర్లోకి టెర్రరిస్టులను పంపేందుకు వీలుగా దీన్ని ట్రాన్స్పోర్ట్ క్యాంప్గా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడూ 50 నుంచి 100 మంది టెర్రరిస్టులు ఉంటారు.
5 మస్కర్ రహీల్ షహీద్: స్నైపింగ్ టెక్నిక్ ట్రైనింగ్
కోట్లిలోని మస్కర్ రహీల్ షహీద్ క్యాంప్. పీవోకేలో హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన క్యాంప్ ఇది. దాదాపు 200 మందికి ట్రైనింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు ఉంటాయి. దాడి జరిగినప్పుడు 30 మంది వరకు ఉండొచ్చు. వెపన్స్ వాడకం, ఫిజికల్ ఫిట్నెస్పై ట్రైనింగ్ ఇస్తుంటారు. బార్డర్ యాక్షన్ టీమ్, స్నైపింగ్ టెక్నిక్ నేర్పిస్తుంటారు. పర్వత యుద్ధతంత్రాల్లో ట్రైనింగ్ ఇస్తుంటారు. హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ దీనికి చీఫ్గా ఉన్నాడు. ఇక్కడ భారీగా ఆయుధాలు డంప్ చేసి ఉంచుతారు.
6 మర్కజ్ అబ్బాస్ క్యాంప్:125 మందికి శిక్షణ
కోట్లిలోని మర్కజ్ అబ్బాస్ ఉగ్ర క్యాంప్.. ఎల్వోసీ నుంచి 35 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. పాకిస్థాన్ మిలటరీ క్యాంప్కు 2 కిలో మీటర్ల దూరంలోనే ఇది ఉంది. 125 మందికి ట్రైనింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఎప్పుడూ కనీసం 50 మంది వరకు ఉంటారు. హఫీజ్ అబ్దుల్ షకూర్ అలియాస్ ఖారీజరార్ ఈ కేంద్రానికి హెడ్. ఇతను జైషే వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. 2016 నగ్రోటాలోని బాలెనీ ఆర్మీ క్యాంప్పై దాడిలో ఇతడి ప్రమేయం ఉన్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. అవసరమైనప్పుడు షకూర్ స్వయంగా ఆయుధాలను సియాల్కోట్కు తరలిస్తాడు.
7 మర్కజ్ అహ్లే హదిత్ క్యాంప్: ఆయుధాల సప్లై అడ్డా
బర్నాలలోని మర్కజ్ అహ్లే హదిత్ క్యాంప్ లో లష్కరే తోయిబా టెర్రరిస్టులు ఉంటారు. పీవోకేలోని భింబెర్ జిల్లాలో ఇది ఉన్నది. ఇక్కడ 150 మందికి ట్రైనింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఎప్పుడూ కనీసం 40 మంది ఉంటారు. ఈ కేంద్రాన్ని లష్కరే కమాండర్ ఖాసీం గుజ్జర్, అనాస్జరార్ నిర్వహిస్తున్నారు. పూంఛ్ రాజౌరి – రియాసీ సెక్టార్లోకి లష్కరే ఉగ్రవాదులు, ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం.
8 మెహ్మూనా జోయా క్యాంప్: హిజ్బుల్ ముజాహిదీన్లకు ట్రైనింగ్
పాకిస్తాన్ సియల్కోట్లోని మెహ్మూనా జోయా క్యాంప్. ఇంటర్నేషనల్ బార్డర్కు 15 కి.మీ. దూరంలో ఉంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం ఇది. దీనికి మోహద్ ఇర్ఫాన్ ఖాన్ కమాండర్గా వ్యవహరిస్తున్నాడు. ఇతడు 1995లో జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో వరుస పేలుళ్లకు పాల్పడ్డాడు. అప్పుడు గవర్నర్ కేవీ కృష్ణారావు తృటిలో ఈ దాడుల నుంచి బయటపడ్డారు. ఈ స్థావరంలో 50 మంది ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. ఎప్పుడూ ఇక్కడ దాదాపు 20 నుంచి 25 మంది ఉంటారు.
9సర్జల్ క్యాంప్: సొరంగాలకు కేరాఫ్
సొరంగాలకు కేరాఫ్గా తెహ్రా కలాన్లోని సర్జల్ క్యాంప్. జైషే మహ్మద్ టెర్రరిస్టులు ఉంటారు. జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించేం దుకు ఉపయోగిస్తున్నారు. ఇండియా లోని సాంబా సెక్టార్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇండియాలోకి సొరంగాలు తవ్వేందుకు ఇది కేంద్రంగా ఉంది. షకర్గర్ ప్రాంతాన్ని లష్కరే, జైషేలు సొరంగాల నెట్వర్క్గా మార్చేశాయి. ఇండియాలోకి వెపన్స్, డ్రగ్స్ సప్లై చేసేందుకు మెయిన్ లాంచ్ ప్యాడ్. రేడియో రిసీవర్లు, కమ్యూనికేషన్ సెంటర్లు ఉన్నాయి. పఠాన్ కోట్ ఎయిర్ బేస్పై దాడి చేసిన ఉగ్రవాదులకు జైషే కమాండర్ షాహిద్ లతీఫ్ ఇక్కడే బ్రెయిన్ వాష్ చేశాడు.