కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కీలక ప్రకటన చేశారు. 2024 - 2025 సంవత్సరాలలో ఇండియన్ రైల్వేస్లో 1,20,579 ఖాళీలను భర్తీ చేయడానికి నియామక ప్రక్రియ చేపట్టిందని చెప్పారు. గత 11 ఏళ్లలో రైల్వే 5.08 లక్షల ఉద్యోగాలను ఇచ్చాయి, అంతకుముందు పదేళ్లలో ఇచ్చిన 4.11 లక్షల ఉద్యోగాల కంటే ఇది చాలా ఎక్కువ అని అన్నారు.
రైల్వేలకు చాలా పెద్ద నెట్వర్క్, ఎప్పుడూ ఉండే పనులు, అవసరాలు ఇంకా ఎక్కువ విస్తీర్ణం ఉండటం వల్ల నియామకాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని మంత్రిత్వ శాఖ చెప్పింది. టెక్నాలజీ మార్పులు, మెషీన్స్ వాడకం, భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఆయా విభాగాల అవసరాల ప్రకారం ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
2024లో ఇండియన్ రైల్వేలు 92వేల పోస్టుల కోసం పది కీలక ఉద్యోగ ప్రకటనలు (CENలు) విడుదల చేశాయి. వీటిలో ముఖ్యంగా అసిస్టెంట్ లోకో పైలట్లు (ALPలు), టెక్నీషియన్లు, RPF సబ్-ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, జూనియర్ ఇంజనీర్లు, NTPC పోస్టులు, ట్రాక్ మెయింటెయినర్లు వంటి లెవల్-1 పోస్టులు ఉన్నాయి.
ఇప్పటికే 59,678 పోస్టుల కోసం మొదటి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) చాలా నగరాల్లో, వేర్వేరు భాషల్లో పూర్తయింది. ALP, JE/DMS/CMA ఇంకా NTPC పోస్టులకు రెండవ దశ CBTలు, అలాగే ALP పోస్టులకు కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) కూడా పూర్తయ్యాయి. 32వేల కంటే ఎక్కువ ఖాళీలతో లెవల్-1 పోస్టులకు నియామకాలు నవంబర్ 2025లో మొదలయ్యాయి. 4208 RPF కానిస్టేబుళ్ల కోసం శారీరక సామర్థ్య పరీక్ష (Physical Test) కూడా మొదలైంది. ఇప్పటివరకు, భద్రతకు సంబంధించిన ముఖ్య విభాగాలలో 23 వేల కంటే ఎక్కువ మంది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా....
►ALSO READ | ఇండియా,రష్యా బంధం మరింత బలోపేతం..రష్యన్ పౌరులకు 30 రోజుల ఫ్రీ వీసా: ప్రధానిమోదీ
2025 సంవత్సరానికి రైల్వేలు ఇప్పటికే 28,463 పోస్టుల కోసం ఏడు ప్రకటనలను విడుదల చేసింది. అన్ని పరీక్షలు నిష్పక్షపాతంగా , పారదర్శకంగా జరుగుతున్నాయని, పేపర్ లీకేజీలు లేదా అక్రమాలు జరిగినట్లు ఎలాంటి రిపోర్టులు లేవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
నియామక ప్రక్రియను సులభం చేయడానికి 2024 నుండి అన్యువల్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ కూడా ప్రవేశపెట్టారు. దీనివల్ల అభ్యర్థులకు పరీక్షలు, శిక్షణ, నియామకాలకు సంబంధించిన సమయం గురించి స్పష్టమైన సమాచారం లభిస్తుంది. తాత్కాలిక కాంట్రాక్టు ఉద్యోగాలు కేవలం అత్యవసరమైన పనులకు మాత్రమే, అవి రెగులర్ ఉద్యోగాలుగా మారవు. ఈ వివరాలన్నీ అశ్విని వైష్ణవ్ గారు లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు.
