వాషింగ్టన్ : అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్(72) కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆమెకు సోమవారం కరోనా టెస్టులు చేసినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ టెస్టులో కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె డెలావేర్లోని రెహోబోత్ బీచ్లోని ఇంట్లో జిల్ బైడెన్ ఐసోలేషన్లో ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ జోబైడెన్ కు కూడా కరోనా టెస్టులు జరిపామని..ఆయనకు నెగిటివ్ వచ్చిందని తెలిపారు. దంపతులిద్దరికీ నిత్యం పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. జిల్ బైడెన్కు కరోనా రావడంతో ప్రెసిడెంట్ బైడెన్ ఢిల్లీ పర్యటనపై సందిగ్ధత నెలకొంది.
శనివారం నుంచి మన దేశంలో జీ20 లీడర్స్ సమిట్ జరగనుండగా..అందులో పాల్గొనేందుకు బైడెన్ గురువారమే ఢిల్లీకి వస్తారని వైట్హౌస్ గత వారం తెలిపింది. కరోనా కారణంగా ఆయన పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి. కాగా.. బైడెన్ ఢిల్లీ పర్యటన సందిగ్ధతపై వైట్ హౌస్
ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.