
- ప్రాజెక్టు నిర్ణయాలు కేబినెట్ ఆమోదంతోనే జరిగాయన్న నేతలు
- బ్యారేజీల లొకేషన్ల మార్పు టెక్నికల్ నిర్ణయాలని వెల్లడి
- కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుపై అచ్చుగుద్దినట్టు జవాబు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ముందు ప్రజాప్రతినిధుల విచారణ దాదాపు ముగిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్రావు, మాజీ సీఎం కేసీఆర్కమిషన్ ముందు హాజరై వారి స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే, పలు ప్రశ్నలకు ముగ్గురు నేతలు ఒకే రకమైన సమాధానాలు చెప్పారు. కూడబలుక్కున్నట్టుగా ఒకే మాట కమిషన్ ముందు చెప్పుకొచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయాలు, కేబినెట్ ఆమోదం, బ్యారేజీల స్థలాల మార్పు, కార్పొరేషన్ ఏర్పాటు వంటి ప్రశ్నలకు ముగ్గురు నేతలు ఒకేరకంగా జవాబులు చెప్పడం గమనార్హం. తొలుత ఈ నెల 6న ఈటల రాజేందర్, 9న హరీశ్ రావు, 11న కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. ముగ్గురు నేతలకు కమిషన్ కొన్ని ప్రశ్నలను దాదాపు సేమ్ అడిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్నిర్మాణంపై కేబినెట్ మొత్తం ఆమోదం తెలిపిందని ముగ్గురు నేతలూ చెప్పారు.
బ్యారేజీల స్థలాల మార్పుపై రాజకీయ నేతలకు ఏమీ తెలియదని, టెక్నికల్ కమిటీనే చూసుకుంటుందని ఈటల చెప్పారు. ఈ విషయంలో ఇంజినీర్లదే బాధ్యత అని హరీశ్ రావు.. తాజాగా కేసీఆర్ బదులిచ్చారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి.. ఈటల, హరీశ్, కేసీఆర్అచ్చుగుద్దినట్టు ఒకే సమాధానం చెప్పడం గమనార్హం.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులకు నిధుల కటకట ఉండేదని, దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రుణాల కోసం కార్పొరేషన్ను ఏర్పాటు చేశారని వారు కమిషన్కు చెప్పుకొచ్చారు. బ్యారేజీలకు వచ్చే ఆదాయం ద్వారానే రుణాల చెల్లింపులు చేయాల్సి ఉంటుందని వివరించారు.
ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలకూ కేబినెట్ ఆమోదం ఉందని ముగ్గురు నేతలు కమిషన్కు వివరించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మించకపోవడంపైనా ముగ్గురూ సేమ్ ఆన్సర్ చెప్పారు. అక్కడ నీటి లభ్యత లేదంటూ సీడబ్ల్యూసీ చెప్పిందని, ఇటు 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మించేందుకు మహారాష్ట్ర ఒప్పుకోలేదని ఆ ముగ్గురు నేతలు కమిషన్కు చెప్పడం గమనార్హం.
కేసీఆర్తో హరీశ్ వరుస భేటీలు..
కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణకు ముందు కేసీఆర్తో ఫాంహౌస్లో హరీశ్ రావు వరుస భేటీలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలనూ చర్చించారు. ఇంజినీర్లను ఎలాంటి ప్రశ్నలు అడిగారు.. సమాధానాలు ఏం చెప్పాలన్న దానిపై సుదీర్ఘ చర్చలు జరిపారు. హరీశ్ రావు విచారణ అనంతరం నేరుగా ఫాంహౌస్కు వెళ్లి కేసీఆర్తో భేటీ అయ్యారు. తనను కమిషన్ అడిగిన ప్రశ్నలను కేసీఆర్కు వివరించారు.
ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏం చెప్పారో కూడా కేసీఆర్కు చెప్పారని సమాచారం. కేసీఆర్ విచారణ సమయంలోనూ కమిషన్ దాదాపు హరీశ్ను అడిగిన ప్రశ్నలనే.. అడిగినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే హరీశ్ ఏవైతే సమాధానాలు చెప్పారో.. కేసీఆర్ కూడా కమిషన్ ముందు చెప్పారన్న చర్చ నడుస్తున్నది.
హరీశ్తో ఈటల భేటీపై అధికారపక్షం ఆరోపణలు..
విచారణకు ముందు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కూడా సమావేశమైనట్టు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. శామీర్పేటలోని ఓ ఫాంహౌస్లో వాళ్లిద్దరూ భేటీ అయినట్టు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఓపెన్గానే ఆరోపణలు చేశారు. అందుకు తగ్గట్టుగానే కమిషన్ ముందు ఈటల రాజేందర్ సమాధానాలు చెప్పారన్న అభిప్రాయాలూ రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ను కాపాడే రీతిలో ఈటల రాజేందర్ సమాధానాలున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి.
ఈటల సొంత పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా.. ప్రెస్మీట్లో ఈటల రాజేందర్ కేసీఆర్ను కాపాడేలా కమిషన్కు సమాధానాలు చెప్పి ఉంటే తప్పేనని చెప్పుకొచ్చారు. ఈక్రమంలో ముగ్గురు నేతలూ కాళేశ్వరం కమిషన్ వద్ద ఒకే రకమైన సమాధానాలు ఇవ్వడంపై పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది.