ముగ్గురిదీ ఒకే మాట!.. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల, హరీశ్, కేసీఆర్ ఒకే తరహా సమాధానాలు

 ముగ్గురిదీ ఒకే మాట!.. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల, హరీశ్, కేసీఆర్ ఒకే తరహా సమాధానాలు
  • ప్రాజెక్టు నిర్ణయాలు కేబినెట్​ ఆమోదంతోనే జరిగాయన్న నేతలు
  • బ్యారేజీల లొకేషన్ల మార్పు టెక్నికల్​ నిర్ణయాలని వెల్లడి
  • కాళేశ్వరం కార్పొరేషన్  ఏర్పాటుపై అచ్చుగుద్దినట్టు జవాబు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్​ ముందు ప్రజాప్రతినిధుల విచారణ దాదాపు ముగిసింది. బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్, ఇరిగేషన్​ శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్​రావు, మాజీ సీఎం కేసీఆర్​కమిషన్​ ముందు హాజరై వారి స్టేట్​మెంట్లు ఇచ్చారు. అయితే, పలు ప్రశ్నలకు ముగ్గురు నేతలు ఒకే రకమైన సమాధానాలు చెప్పారు. కూడబలుక్కున్నట్టుగా ఒకే మాట కమిషన్​ ముందు చెప్పుకొచ్చారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయాలు, కేబినెట్​ ఆమోదం, బ్యారేజీల స్థలాల మార్పు, కార్పొరేషన్​ ఏర్పాటు వంటి ప్రశ్నలకు ముగ్గురు నేతలు ఒకేరకంగా జవాబులు చెప్పడం గమనార్హం. తొలుత ఈ నెల 6న ఈటల రాజేందర్​, 9న హరీశ్​ రావు, 11న కేసీఆర్​ విచారణకు హాజరయ్యారు. ముగ్గురు నేతలకు కమిషన్​ కొన్ని ప్రశ్నలను దాదాపు సేమ్​ అడిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్​నిర్మాణంపై కేబినెట్​ మొత్తం ఆమోదం తెలిపిందని ముగ్గురు నేతలూ చెప్పారు. 

బ్యారేజీల స్థలాల మార్పుపై రాజకీయ నేతలకు ఏమీ తెలియదని, టెక్నికల్​ కమిటీనే చూసుకుంటుందని ఈటల చెప్పారు. ఈ విషయంలో ఇంజినీర్లదే బాధ్యత అని హరీశ్ రావు.. తాజాగా కేసీఆర్​ బదులిచ్చారు. కాళేశ్వరం కార్పొరేషన్​ ఏర్పాటుకు సంబంధించి.. ఈటల, హరీశ్​, కేసీఆర్​అచ్చుగుద్దినట్టు ఒకే సమాధానం చెప్పడం గమనార్హం. 

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులకు నిధుల కటకట ఉండేదని, దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రుణాల కోసం కార్పొరేషన్​ను ఏర్పాటు చేశారని వారు కమిషన్​కు చెప్పుకొచ్చారు. బ్యారేజీలకు వచ్చే ఆదాయం ద్వారానే రుణాల చెల్లింపులు చేయాల్సి ఉంటుందని వివరించారు.

 ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలకూ కేబినెట్​ ఆమోదం ఉందని ముగ్గురు నేతలు కమిషన్​కు వివరించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మించకపోవడంపైనా ముగ్గురూ సేమ్​ ఆన్సర్​ చెప్పారు. అక్కడ నీటి లభ్యత లేదంటూ సీడబ్ల్యూసీ చెప్పిందని, ఇటు 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మించేందుకు మహారాష్ట్ర ఒప్పుకోలేదని ఆ ముగ్గురు నేతలు కమిషన్​కు చెప్పడం గమనార్హం. 

కేసీఆర్​తో హరీశ్​ వరుస భేటీలు..

కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ విచారణకు ముందు కేసీఆర్​తో ఫాంహౌస్​లో హరీశ్​ రావు వరుస భేటీలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలనూ చర్చించారు. ఇంజినీర్లను ఎలాంటి ప్రశ్నలు అడిగారు.. సమాధానాలు ఏం చెప్పాలన్న దానిపై సుదీర్ఘ చర్చలు జరిపారు. హరీశ్​ రావు విచారణ అనంతరం నేరుగా ఫాంహౌస్​కు వెళ్లి కేసీఆర్​తో భేటీ అయ్యారు. తనను కమిషన్​ అడిగిన ప్రశ్నలను కేసీఆర్​కు వివరించారు. 

ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏం చెప్పారో కూడా కేసీఆర్​కు చెప్పారని సమాచారం. కేసీఆర్​ విచారణ సమయంలోనూ కమిషన్​ దాదాపు హరీశ్​ను అడిగిన ప్రశ్నలనే.. అడిగినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే హరీశ్​ ఏవైతే సమాధానాలు చెప్పారో.. కేసీఆర్​ కూడా కమిషన్​ ముందు చెప్పారన్న చర్చ నడుస్తున్నది.

హరీశ్​తో ఈటల భేటీపై అధికారపక్షం ఆరోపణలు..

విచారణకు ముందు హరీశ్​ రావు, ఈటల రాజేందర్​ కూడా సమావేశమైనట్టు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. శామీర్​పేటలోని ఓ ఫాంహౌస్​లో వాళ్లిద్దరూ భేటీ అయినట్టు పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ ఓపెన్​గానే ఆరోపణలు చేశారు. అందుకు తగ్గట్టుగానే కమిషన్​ ముందు ఈటల రాజేందర్​ సమాధానాలు చెప్పారన్న అభిప్రాయాలూ రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్​ను కాపాడే రీతిలో ఈటల రాజేందర్​ సమాధానాలున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. 

ఈటల సొంత పార్టీ నేత కొండా విశ్వేశ్వర్​ రెడ్డి కూడా.. ప్రెస్​మీట్​లో ఈటల రాజేందర్​ కేసీఆర్​ను కాపాడేలా కమిషన్​కు సమాధానాలు చెప్పి ఉంటే తప్పేనని చెప్పుకొచ్చారు.  ఈక్రమంలో  ముగ్గురు నేతలూ  కాళేశ్వరం కమిషన్​ వద్ద ఒకే రకమైన సమాధానాలు ఇవ్వడంపై  పొలిటికల్​ సర్కిల్స్​లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది.