గద్దర్ అవార్డులా.. నంది అవార్డులా? : కంచ ఐలయ్య

గద్దర్ అవార్డులా.. నంది అవార్డులా? : కంచ ఐలయ్య
  • తెలంగాణ కళాకారులు, ప్రజా గాయకులను సర్కార్‌‌‌‌‌‌‌‌ మర్చిపోయింది: కంచ ఐలయ్య

హైదరాబాద్ సిటీ, వెలుగు: గద్దర్ అవార్డుల కార్యక్రమం సినిమా నటుల, రాజకీయ నాయకుల వ్యవహారంగా మారిందని ప్రొఫెసర్ కంచ ఐలయ్య విమర్శించారు. తెలంగాణ సంస్కృతిని ఫ్యూడల్ వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య రూపంలోకి మార్చిన గద్దర్ ఆదర్శాలను ఈ వేడుక ప్రతిబింబించలేకపోవడం విచారకరమన్నారు. తెలంగాణ జానపద కళలు, ప్రజాస్వామ్య, సమ్మిళిత స్ఫూర్తిని జరుపుకోవడానికి బదులు.. సినిమా నటులు, రాజకీయ నాయకుల ఆధిపత్యంలో ఈ కార్యక్రమం జరిగినట్లు కనిపించిందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

గద్దర్ పేరిట అవార్డు ప్రకటించడం ద్వారా తెలంగాణ కళలు, సంస్కృతిలో కొత్త విప్లవం మొదలవుతుందని తాను భావించామని.. అయితే, ఇప్పుడు సినిమా రంగాన్ని ఏయే కులాలు ఆధిపత్యం చేస్తున్నాయో కనిపించిందన్నారు. గద్దర్ అవార్డు కేవలం మరో నంది అవార్డుగా మారిపోయినట్లు అనిపించిందన్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్న సినిమా సంస్కృతిని మార్చి, ఫూలే తరహా కొత్త తెలుగు సినిమా నిర్మాణం జరగాలని గద్దర్ అవార్డు ద్వారా ఆశించామని, అయితే, అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదని అసహనం వ్యక్తం చేశారు.

అవార్డు జ్యూరీలో ఒక్క జానపద కళాకారుడు కూడా లేడన్నారు. దశాబ్దాలుగా తెలంగాణ సంస్కృతిని మార్చిన అనేక మంది కళాకారులు, గీత రచయితలు, గాయకులు, నృత్యకారులను పక్కనపెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని, తనలాంటి అనేక మంది గద్దర్ సహచరులకు సైతం పిలుపు రాలేదన్నారు.