పర్మిషన్ ఇయ్యకుంటే  మండపంలోనే ఉంచుతం

పర్మిషన్ ఇయ్యకుంటే  మండపంలోనే ఉంచుతం
  • ట్యాంక్ బండ్ లో నిమజ్జనం జరిగేలా ప్రభుత్వం చూడాలె
  • ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ వినతి

హైదరాబాద్, వెలుగు: ఈసారి ట్యాంక్ బండ్ లోనే ఖైరతాబాద్ గణేశ్ ను నిమజ్జనం చేస్తామని.. అలా జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని, కోర్టును ప్రత్యేకంగా కోరుతున్నామని ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ తెలిపారు. పర్మిషన్ లేదంటే విగ్రహాన్ని ఇక్కడే ఉంచుతామని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది 70 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్టిస్తామని, మండపంలోనే నిమజ్జనం చేస్తామని తెలిపారు. ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, ఇప్పటివరకు10 లక్షల మందికిపైగా దర్శించుకున్నారని వెల్లడించారు. 
హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తం
హుస్సేన్ సాగర్ లోనే వినాయక నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు వెల్లడించారు. నిమజ్జనానికి ఏర్పాట్లు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. నిమజ్జనం చేసుకోవద్దని హైకోర్టు చెప్పలేదని, కోర్టు తీర్పును అమలు చేస్తారా చేయారా ప్రభుత్వం చేతిలో ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా సాగర్ లో నిమజ్జనం ఏర్పాట్లు చేయాలన్నారు. కోర్టు తీర్పులను కాదని జల్లికట్టు లాంటి పండుగలే నిర్వహిస్తుంటే నిమజ్జనం ఎందుకు చేయొద్దన్నారు.
పీపుల్స్​ప్లాజాaలో క్రేన్ల ఏర్పాటు
సాగర్ లో పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) విగ్రహాలు నిమజ్జనం చేయోద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్​వేశారు. కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ ఉండటంతో నిమజ్జనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోంది. ప్రత్యమ్నాయంగా ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ ఆర్ మార్గ్ లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాట్లయితే చేశారు. 5 ఫీట్లకు పైగా ఎత్తున్న విగ్రహాలను ఈ రెండు ప్రాంతాల్లో వేస్తుండగా ఇంతకు తక్కువ ఎత్తున్న వాటిని సంజీవయ్యపార్కులోని బేబీ పాండ్ లో వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. నిమజ్జనం కోసం మంగళవారం ఎన్టీఆర్ మార్గ్​పై రెండు క్రేన్లు, పీపుల్స్ ప్లాజా వద్ద 5, బేబీ పాండ్ లో 2 క్రేన్లను ఏర్పాటు చేశారు. 
ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం సవాల్
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ప్రభుత్వానికి ఈసారి సవాల్​గా మారింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సంజీవయ్య పార్కులోని బేబీ పాండ్ లో ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే అందుకు ఏర్పాట్లు మాత్రం చేయట్లేదు. బుధవారం సుప్రీంకోర్టు తీర్పు తరువాత అధికారులు నిర్ణయాని రానున్నట్లు తెలిసింది. ట్యాంక్ బండ్ లో నిమజ్జనం వద్దని తీర్పొస్తే బేబీ పాండ్ లోనే ఖైరతాబాద్ గణేశ్​నిమజ్జనం జరిగే అవకాశం ఉంది. 
నిమజ్జనంపై మంత్రి తలసాని సమావేశం
హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం మాసబ్​ట్యాంక్ లోని ఆయన ఆఫీసులో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి, జనరల్ సెక్రటరీ భగవంతరావు, వైస్ ప్రెసిడెంట్ కరోడి మాల్, విశ్వహిందు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజుతో మంత్రి సమావేశమయ్యారు. సుప్రీం తీర్పు కోసం ఎదురు చూస్తున్నామన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ  ట్యాంక్ బండ్ సహా గ్రేటర్ పరిధిలోని చాలా పాండ్స్​లో నిమజ్జనం ఏర్పాట్లు చేశామన్నారు. సాగర్‌లో కచ్చితంగా నిమజ్జనం చేస్తామనడం భాగ్యనగర్ గణేశ్​ఉత్సవ సమితి అభిప్రాయమన్నారు.