కొత్తగూడెం బస్టాండ్కు మంచి రోజులు.. రూ.10 కోట్లతో కొత్త బిల్డింగ్

కొత్తగూడెం బస్టాండ్కు మంచి రోజులు.. రూ.10 కోట్లతో కొత్త బిల్డింగ్
  • డీఎంఎఫ్​టీ ఫండ్స్​ రూ. 10కోట్లు సాంక్షన్​  
  • అన్ని హంగులతో.. పక్కా ప్రణాళికతో నిర్మాణం.. 
  • ఇక పాల్వంచ బస్టాండ్​ బిల్డింగ్​ నిర్మాణానికీ నిధుల కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కూనంనేని వెల్లడి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని బస్టాండ్​కు మంచిరోజులు రానున్నాయి. ఇన్నాళ్లు వానొస్తే డిపో మేనేజర్​ ఆఫీస్​తో పాటు బిల్డింగ్​ చాలా వరకు కురిసేది. బస్టాండ్ ​ఆవరణ గుంతలమయంగా మారింది. దీంతో ప్రయాణికులకు పాట్లు తప్పడం లేదు. ఈ క్రమంలో శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్న బస్టాండ్​ స్థానంలో రూ.10 కోట్లతో కొత్త బిల్డింగ్ ​నిర్మించనున్నారు.  ఇటీవల జరిగిన ఓ  ప్రోగ్రాంలో కొత్తగూడెం బస్టాండ్​కు డీఎంఎఫ్​టీ కింద రూ. 10కోట్లు సాంక్షన్​  చేస్తున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్. బలరాంతో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొనడంతో నగర వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొత్తగూడెం బస్టాండ్​తో పాటు పాల్వంచ బస్టాండ్​ నిర్మాణానికి ఫండ్స్​ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

పాత బిల్డింగ్.. గత పాలకులు పట్టించుకోలే.. 

కొత్తగూడెం నగరం నడిబొడ్డున ఉన్న బస్టాండ్​ భవనం దాదాపు ఐదు దశాబ్దాల కిందటి నిర్మించినది. కొన్నేండ్లుగా సమస్యలతో సతమతమవుతోంది. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో రవాణాశాఖ మంత్రిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్​ ఉన్నారు. అప్పుడు పలుమార్లు కొత్తగూడెం బస్టాండ్​ను సందర్శించారు.. అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చారు కానీ, అమలు మాత్రం చేయలేదు.  బస్టాండ్​ అభివృద్ధిలో భాగంగా రూ. 80లక్షలు కేటాయిస్తున్నట్టుగా అప్పటి మున్సిపల్​  పాలకవర్గం తీర్మానం చేసింది.

 మున్సిపల్​ ఇంజినీరింగ్​ అధికారులు వచ్చి ఎస్టిమేషన్లంటూ హడావుడి కూడా చేశారు. కానీ ఫండ్స్​ రిలీజ్​లో మొండి చేయి చూపింది. దీంతో ఏంచేసేది లేక శిథిలావస్థ బస్టాండ్​లోనే ఆర్టీసీ యాజమాన్యం నెట్టుకొస్తోంది. చిన్నపాటి వర్షానికే బస్టాండ్​ నిండిపోతోంది. డిపో మేనేజర్​ ఆఫీస్​ రూంతో పాటు అన్ని రూంలు పైకప్పు లీకేజీలు అవుతున్నాయి. కొన్నిచోట్ల స్లాబ్​ పెచ్చులూడుతోంది. బస్టాండ్​ ఆవరణలో అన్ని గుంతలు ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

టాయిలెట్స్​ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. రోజూ దాదాపు 25 వేల నుంచి 29వేల మంది ప్రయాణికులు ఈ బస్టాండ్​ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. రోజుకు రూ. 13లక్షల ఆదాయం వస్తోంది. 62బస్సులు ఈ డిపో నుంచి తిరుగుతున్నాయి. ఇక్కడి నుంచి ఏపీతోపాటు ఒడిశా, చత్తీస్ గఢ్​ రాష్ట్రాలకు కూడా బస్సు సర్వీసులు ఉన్నాయి. ఈ క్రమంలో కొత్తగూడెం బస్టాండ్​ అభివృద్ధికి డీఎంఎఫ్​టీ కింద సింగరేణి రూ. 10కోట్లు సాంక్షన్​ చేసింది. త్వరలో కొత్తగూడెం బస్టాండ్​ అన్నివసతులతో కొత్తగా కనిపించనుంది. 

సింగరేణి సీఎండీ, కలెక్టర్​ సహకారం మరువలేనిది.. 

కొత్తగూడెం బస్టాండ్​ అభివృద్ధికి డీఎంఎఫ్​టీ కింద రూ. 10కోట్లు సాంక్షన్​ చేయడంలో కృషి చేసిన సింగరేణి సీఎండీ బలరాంతో పాటు కలెక్టర్​ జితేశ్​​కు కృతజ్ఞతలు. జిల్లా కేంద్రంలో బస్టాండ్​ శిథిలావస్థలో ఉన్న విషయమై పలుమార్లు సీఎంతో పాటు మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చాను. ఫండ్స్​ కోసం సింగరేణి సీఎండీని కలిశాను. బస్టాండ్​ అభివృద్ధికి రూ. 16కోట్లు అవసరం, మొదటి దశలో రూ. 10కోట్లను డీఎంఎఫ్​టీ కింద ఫండ్స్​ సాంక్షన్​ అయ్యాయి. - కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్యే, కొత్తగూడెం