- రాష్ట్రంలో అన్ని రంగాల్లో
- ప్రభుత్వం విఫలం: కేటీఆర్
- ఇందిరమ్మ రాజ్యం అంటే హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొట్టుడా?
- తోక జాడిస్తున్న పోలీసుల పనిచెప్తామని వార్నింగ్
హైదరాబాద్సిటీ, వెలుగు: పదేండ్లలో రాష్ట్రంలో రియల్ఎస్టేట్ వెలుగొందిందని, రెండేండ్లలో కాంగ్రెస్వల్లే పడిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. శనివారం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ వద్ద జరిగిన రోడ్షోలో కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదని అన్నారు. కేసీఆర్ పేదల కోసం ఇండ్లు నిర్మిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను అడ్డంపెట్టుకొని వాటిని కూలుస్తున్నదన్నారు.
‘‘ఒక్క చాన్స్ అని సీఎం రేవంత్రెడ్డి అడుగుతున్నారు. ఒక్క చాన్స్ ఇచ్చినందుకే 800 మంది రైతులను ఆగం చేశారు. 106 మంది ఆటోడ్రైవర్ల ఉసురు తీసుకున్నారు” అని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి.. ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. ‘‘ కేసీఆర్ హయాంలో పదేండ్లపాటు ఆనందంగా బతికినం. కేసీఆర్ బాగా చూసుకున్నారు. పెన్షన్ 200 నుంచి 2 వేలు చేశారు. కల్యాణలక్ష్మితో పేద పిల్లకు పెళ్లిళ్లు జరిగాయి. కేసీఆర్కిట్, 58, 58 జీవోలతో పేదలకు ఇండ్ల పట్టాలు, ఇంటింటికీ ఉచిత నీటి సదుపాయం కల్పించినం. అందరినీ ఆదుకున్నం” అని తెలిపారు. కాంగ్రెస్పార్టీ 420 మోసపూరిత హామీలతో ప్రజల్ని మోసం చేసిందని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కట్డుడు కాదు.. కూలగొట్టుడు అని మండిపడ్డారు. వేల ఇండ్లను హైడ్రా పేరుతో కూల్చారని, ఈ ఎన్నికలు కారుకు, బుల్డోజర్మధ్య పోరాటమని తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను బెదిస్తున్నారని కేటీఆర్ఆరోపించారు. ‘‘పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. 500 రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. అందరినీ గుర్తు పెట్టుకుంటాం. తోకలు కట్చేస్తం” అని హెచ్చరించారు. ఈ నెల 14న తమ సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు. నోట్లతో ఓట్లు కొనాలని అనుకుంటున్నారని, మాగంటి గోపీనాథ్ భార్యపై కూడా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గోపీనాథ్ యాదిలో తాము ఆయన భార్య సునీతకు అండగా నిల్చుంటామని చెప్పారు.
