హైదరాబాద్ రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి.. ఇబ్రహీంపట్నం,మెహిదీపట్నం, కూకట్ పల్లిలో ప్రమాదాలు

 హైదరాబాద్ రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి.. ఇబ్రహీంపట్నం,మెహిదీపట్నం, కూకట్ పల్లిలో ప్రమాదాలు

ఇబ్రహీంపట్నం/మెహిదీపట్నం/ కూకట్​పల్లి, వెలుగు: వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో లారీ ఢీకొని లైన్​మెన్ మృతి చెందాడు. మేడిపల్లికి మహ్మద్​ముజాహెద్​(26)  కొత్తూరులో జూనియర్ లైన్ మెన్ పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి విధులు ముగించుకొని తన పల్సర్ బైక్​పై యాచారం వైపు వెళ్తుండగా, లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముజాహెద్​అక్కడికక్కడే మృతి చెందాడు. 

బస్సు సడెన్​బ్రేక్ వేయడంతో..  సాఫ్ట్​వేర్ ఉద్యోగి

లంగర్​హౌస్ పరిధిలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్​వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. నార్సింగి అల్కాపురి టౌన్ షిప్​కు చెందిన వెంకట రాఘవేందర్ (37) సాఫ్ట్​వేర్ ఉద్యోగి. గురువారం తన భార్యతో కలిసి బైక్‌‌‌‌పై బంధువుల ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో లంగర్​హౌస్ బ్రిడ్జిపై ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సడన్​బ్రేక్‌‌‌‌ వేసింది. వెనకాలే వస్తున్న లారీ కూడా ఒక్కసారిగా స్లో కావడంతో లారీని ఢీకొని రాఘవేందర్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. 

కేపీహెచ్​బీలో వృద్ధుడు

కేపీహెచ్​బీలో రోడ్డు దాటుతుండగా, ఆటో ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. నిజాంపేటకు చెందిన దిలీప్​కుమార్​ (77) గురువారం హోలిస్టిక్​ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చాడు. చికిత్స అనంతరం రోడ్డు దాటుతుండగా, నిజాంపేట వైపు నుంచి వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో దిలీప్​కుమార్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.