
- విద్యా సేవకులుగా రిటైర్డ్ టీచర్లు.. స్వచ్ఛందంగా విద్యాబోధన
- పైలట్ ప్రాజెక్ట్గా బాసర మండలం ఎంపిక
నిర్మల్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ ను పూర్తిస్థాయి అక్షరాస్యత జిల్లాగా మార్చేందుకు సంబంధిత అధికారులు పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే అందరికీ అక్షరాలు పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం(ఎన్ఎల్ఐపీ)కు అనుగుణంగా పని చేస్తూ ప్రజలందరినీ అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరికీ చదవడం, రాయడం రావాలన్నదే ధ్యేయమని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని నలుగురు అడిషనల్ కలెక్టర్లు, డీఈవోలకు ఈ కార్యక్రమ బాధ్యతలు అప్పజెప్పారు.
తొలుత నిరక్షరాస్యుల గుర్తింపు..
మండలాల వారీగా నిరక్షరాస్యలను గుర్తించనున్నారు. గ్రామ మహిళా సంఘాలకు ఈ పని అప్పగించారు. వీరు తమ గ్రామ పరిధిలో ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. నిరక్షరాస్యుల జాబితా రూపొందించి, అధికారులకు అందించనున్నారు. అయితే, ఈ ప్రోగ్రాంను దశలవారీగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే మొదట చదువుల తల్లి సరస్వతి దేవికి నిలయమైన బాసర మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. మొదటి విడతలో నిరక్షరాస్యులైన మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఎన్ఐఎల్ పీ లెక్కల ప్రకారం..
ఇప్పటికే ఎన్ఐఎల్ పీ అధికారులు మండలాల వారీగా నిరక్షరాస్యులను గుర్తించారు. వీరి లెక్క ప్రకారం.. నిర్మల్ జిల్లాలో మొత్తం 20,866 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. వీరిలో 8,260 మంది పురుషులు, 12,606 మంది మహిళలు. బాసర మండలంలో మొదట 550 మంది నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నారు.
రిటైర్డ్ టీచర్ల సేవలు..
అందరికీ అక్షరాలు కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. వారిని విద్యా సేవకులుగా గుర్తించనున్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయులతోపాటు గ్రామాల్లో చదువుకున్న యువత, ఉద్యోగులు సైతం నిరక్షరాస్యత నిర్మూలనకు తమ వంతు సహకారం అందించాలని అధికారులు కోరుతున్నారు. వీరంతా స్వచ్ఛందంగానే నిరక్షరాస్యులకు విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవారికి ఏఐసీటీఈ, ఎన్ సీటీఈ ద్వారా విద్యా క్రెడిట్లను ప్రదానం చేయనున్నారు.
సమన్వయ కమిటీలు..
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ప్రతీ గ్రామం సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా గ్రామ, మండల స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. గ్రామ కమిటీలో అక్కడి పాఠశాలల హెడ్ మాస్టర్లు, టీచర్లు, అంగన్వాడీ టీచర్లు, మండల కమిటీలో ఎంపీడీవో, ఎంఈవో, ఇతర అధికారులు ఉంటారు. క్షేత్రస్థాయిలో మహిళా సంఘాలు అందించే నివేదిక ఆధారంగా ఈ కమిటీలు బడి మానేసిన వారిని గుర్తించి, ఓపెన్ స్కూల్స్ లో చేరుస్తాయి.
పకడ్బందీగా అమలు చేస్తాం
జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరికీ అక్షరాలు అనే కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. మహిళా సంఘాలకు కీలక బాధ్యతలు అప్పజెప్పాం. గ్రామ, మండల స్థాయిలో కమిటీలు వేసి, రిటైర్డ్ ఉపాధ్యాయులు, స్థానిక యువకులు, ఉద్యోగులు, టీచర్ల సహకారం తీసుకుంటాం. ఫైజాన్ అహ్మద్, అడిషనల్ కలెక్టర్, నిర్మల్