హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా చొరవతో మాదాపూర్లో మరో చెరువు త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నది. మురుగు నీటిని, దుర్గంధాన్ని వదిలించుకుని సహజ సరస్సుగా తమ్మిడికుంట రూపొందుతోంది. ముళ్లపొదలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, మీటర్ల మేర పేరుకుపోయిన పూడికను తొలగించి చెరువుకు సహజత్వాన్ని హైడ్రా అందించింది.
చెరువులో ఆక్రమణలతోపాటు పూడికను తొలగించి విస్తీర్ణం పెంచడంతో ఇప్పుడు ఆ పరిసరాలు ఎంతో విశాలంగా మారాయి. ఈ చెరువుకు శిల్పారామం వైపు ప్రధాన ప్రవేశ మార్గం రానుంది. రూ.10 కోట్లతో చేపట్టిన ఈ చెరువు అభివృద్ధి పనులు జనవరి వరకు పూర్తై అందుబాటులోకి రానుంది.
చిన్నాపెద్ద అందరూ సేదతీరేలా..!
ఈ చెరువు అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం పరిశీలించారు. చెరువు చుట్టూ పటిష్టమైన బండ్ నిర్మాణంతో పాటు ఇన్లెట్లు, ఔట్లెట్ల నిర్మాణ పనులు జరుగుతున్న తీరును తనిఖీ చేశారు. ఐటీ కారిడార్లో ఉన్న ఈ చెరువును ఓ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. శిల్పారామం వద్ద వరద నీరు నిలవకుండా ఇన్లైట్లను అభివృద్ధి చేయాలని సూచించారు.14 ఎకరాల చెరువును 29 ఎకరాలకు విస్తరించడం జరిగిందని, అదే విస్తీర్ణంలో నీరు నిలిచేలా చెరువు అభివృద్ధి చేయాలని సూచించారు.
తమ్మిడికుంటలో స్వచ్ఛమైన నీరు ఎంత ముఖ్యమో.. ఆ పరిసరాలు కూడా అంతే పరిశుభ్రమైన వాతావరణంలో ఉండడానికి చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు చుట్టూ దాదాపు 2 కిలోమీటర్ల మేర ఉన్న బండ్పై ప్రాణ వాయువు అందించడంతో పాటు చల్లటి నీడనిచ్చే చెట్లు పెంచాలన్నారు. చెరువు ప్రధాన ప్రవేశమార్గంలో పార్కులను అభివృద్ధి చేయాలని సూచించారు. అన్ని వయసుల వారు తమ్మిడికుంట పరిసరాలకు వచ్చి సేద దీరేవిధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.
పిల్లలకు క్రీడా స్థలాలను తీర్చిదిద్దాలన్నారు. వృద్ధులు కూర్చునేందుకు వీలుగా చుట్టూ సిమ్మెంట్, రాతి కుర్చీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఓపెన్ జిమ్లు, కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోడానికి వీలుగా గుమ్మటాలు ఏర్పాటు చేయాలన్నారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ ఎన్ అశోక్ కుమార్, ఏసీపీ శ్రీకాంత్ తో పాటు పలువురు ఉన్నారు.
