మడికొండ డంపింగ్​ యార్డ్​లో బయోగ్యాస్​ ప్లాంట్​

 మడికొండ  డంపింగ్​ యార్డ్​లో  బయోగ్యాస్​ ప్లాంట్​

కేంద్ర ప్రభుత్వ ‘గోబర్​ ధన్ స్కీం’కు వరంగల్, నిజామాబాద్​ ఎంపిక     –  ఓరుగల్లులో చెత్త సమస్యకు ఇక చెక్

హనుమకొండ, వెలుగు:  గ్రేటర్​ వరంగల్ మున్సిపల్​ కార్పొరేషన్ లో వేదిస్తున్న చెత్త సమస్యకు పరిష్కారం లభించనుంది.  కేంద్ర ప్రభుత్వ గోబర్​ ధన్ స్కీమ్ ద్వారా నగరం గార్బెజ్​ ఫ్రీ కానుంది. స్వచ్ఛభారత్​ మిషన్​ అర్బన్​ 2.0 లో భాగంగా ఈ స్కీమ్   రాష్ట్రం నుంచి నిజామాబాద్​,  వరంగల్​కు స్థానం దక్కింది. దీంతో ఈరెండు పట్టణాల్లో చెత్తను ప్రాసెస్​ చేసి బయోగ్యాస్​ను ఉత్పత్తి చేస్తారు. దీనికోసం ఇప్పటికే రెండు కార్పొరేషన్ల ఆఫీసర్ల నుంచి ప్రపొజల్స్​ తీసుకుంది. తొందర్లోనే బయోగ్యాస్​ ప్లాంట్లకు సంబంధించిన పనులు షురూ కానున్నాయి. 

చెత్త నుంచి బయోగ్యాస్​ ఉత్పత్తి

పట్టణాల్లో చెత్తను డంపింగ్​ యార్డులో ఎప్పటికప్పుడు ప్రాసెస్​ చేయడంతో పాటు అక్కడే బయోగ్యాస్​ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో 'గోబర్ ధన్'​ పథకాన్ని తీసుకొచ్చింది. వేస్ట్​ టు వెల్త్​ క్రియేట్​ చేయాలనే నినాదంతో ఈ స్కీమ్​ ను ప్రవేశపెట్టగా.. మొదట బయోగ్యాస్​ ప్లాంట్లు ఏర్పాటు చేసి, ఆ తరువాత ప్రాసెస్​ చేసిన చెత్తతో ఎరువు, వెలువడిన గ్యాస్​ నుంచి కరెంట్​ను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. వెజ్​ టెబుల్, ఫ్రూట్​ మార్కెట్ల నుంచి వచ్చే గార్బెజ్​ తో పాటు ఇండ్ల నుంచి వెలువడే తడి చెత్తను ప్రాసెస్​ చేసి కంప్రెస్డ్​ బయో గ్యాస్​(సీబీజీ) ను ఉత్పత్తి చేస్తారు. 

కేంద్ర ప్రభుత్వ స్కీమ్ తో.. 

కేంద్ర తాగునీరు, పారిశుధ్య శాఖ, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ, పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ, సైన్స్​ అండ్​ టెక్నాలజీ, ఎరువుల శాఖ ఇలా మొత్తం 11 విభాగాల సమన్వయంతో ఈ ప్రాజెక్టుకు ముందుకు సాగనుంది. 2023– -24 బడ్జెట్​ లో ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 151 జిల్లాల్లో గోబర్​ ధన్ ప్రాజెక్ట్​ పనులు నడుస్తుండగా.. కొత్తగా మరో 75 నగరాల్లో ఈ బయోగ్యాస్​ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.

మొదట వరంగల్.. తర్వాత నిజామాబాద్​ 

గోబర్​ ధన్​ స్కీంతో ఇప్పటివరకు మధ్యప్రదేశ్​, ఛత్తీస్​ గడ్​, ఉత్తర్​ ప్రదేశ్​, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్లాంట్లు ఉన్నాయి. తెలంగాణలో తొలిసారి గ్రేటర్ వరంగల్​ , నిజామాబాద్​ లో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వరంగల్ నగరంలో రోజు 400 టన్నుల తడి, పొడి చెత్త పేరుకుపోతోంది. దీన్నంతటినీ మడికొండ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. .ఇక్కడ స్మార్ట్ సిటీ ఫండ్స్​ తో దాదాపు రూ.37 కోట్లతో చేపట్టిన బయో మైనింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. యార్డు మొత్తమ్మీద దాదాపు 5 లక్షల టన్నుల వరకు చెత్త పోగై ఉండగా.. ఇంతవరకు కేవలం లక్ష టన్నుల వరకు మాత్రమే బయోమైనింగ్ ద్వారా ప్రాసెస్​ చేసిట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. కాగా నగరంలో వెలువడే ఫ్రెష్​ వెట్​ వేస్టేజీ నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు బాలసముద్రంలో స్వచ్ఛ భారత్​ కింద 2 టీపీడీ(టన్​ పర్​ డే) కెపాసిటీతో బయోగ్యాస్​ నుంచి కరెంట్​ ఉత్పత్తి ప్లాంట్​ ఏర్పాటు చేసినప్పటికీ అది కాస్త మూలకుపడింది. నగరంలో ఫ్రెష్​ వెట్ వేస్టేజీ డైలీ 20 టన్నుల వరకు వెలువడుతుండగా దాన్నంతా మడికొండకే తరలిస్తున్నారు. దీంతో గోబర్​ ధన్​ లో భాగంగా మడికొండ డంప్​ యార్డులోనే 20 టీపీడీ కెపాసిటీతో బయోగ్యాస్​ ప్లాంట్​ ఏర్పాటు చేస్తే.. ఈ చెత్త సమస్య నుంచి విముక్తి లభిస్తుందని స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

త్వరలో టీమ్స్​ 

స్వచ్ఛభారత్ మిషన్​ ఫండ్స్​ తో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ లు రెడీ చేస్తుండగా.. తొందర్లోనే గోబర్​ ధన్​ కు సంబంధించిన టెక్నికల్​ టీమ్స్​ కూడా ఈ రెండు నగరాలను విజిట్​ చేయనున్నాయి. నివేదిక సమర్పించిన తరువాత డీపీఆర్ కు ఆమోదం లభిస్తే ప్లాంట్ల పనులు మొదలవుతాయి. ఓ వైపు బయో మైనింగ్​, మరోవైపు బయోగ్యాస్ ప్లాంట్లతో చెత్త గుట్టలు కరిగిపోయి చుట్టుపక్కల గ్రామాలకు డంప్​ యార్డు కష్టాలు తీరే అవకాశం కనిపిస్తోంది.

తొందర్లోనే పనులు 

స్వచ్ఛ భారత్​ మిషన్​ లో భాగంగా గోబర్​ ధన్​ స్కీంకు గ్రేటర్​ వరంగల్ తో పాటు నిజామాబాద్​ సిటీ ఎంపికైంది. మడికొండ డంప్​ యార్డులో చేయనున్న ఈ ప్రాజెక్ట్​ ప్రస్తుతం డీపీఆర్​ దశలో ఉంది. తొందర్లోనే ఆ ప్రక్రియ పూర్తి చేస్తం. డీపీఆర్​ కు ఆమోదం లభించిన వెంటనే టెండర్లు చేపడుతాం. రెండు, మూడు నెలల్లోనే మడికొండలో బయోగ్యాస్ ప్లాంట్ పనులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
- డా.ఎం.రాజేశ్​, సీఎంహెచ్​వో, గ్రేటర్​ వరంగల్​