
మహబూబ్నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేందిర బోయి బుధవారం రూరల్ మండలం ధర్మాపూర్ జడ్పీహెచ్ఎస్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. బోర్డుపై ఇండియా మ్యాప్ గీసి ఉండడంతో దిక్కులు, రాష్ర్టాలను అడిగి జవాబులు రాబట్టారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ భోజనం ఎలా ఉంది? సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ ఏఐ కంప్యూటర్ ల్యాబ్ బోధన గురించి ఆరా తీశారు. విద్యార్థుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని, స్కూల్ను ఉన్నత పాఠశాలకు మార్చాలని సూచించారు.
విపత్తులపై అలర్ట్ గా ఉండండి
ఎలాంటి విపత్తులు ఎదురైనా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, జిల్లా అధికారులతో ఫ్లడ్ మేనేజ్ మెంట్ పై రివ్యూ నిర్వహించారు. జిల్లాల్లో వర్షాలు, వరదల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రగతిపై పక్కాగా రిపోర్ట్ ఉండాలి
పంచాయతీల ప్రగతిపై పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ ఇండికేటర్లు ఖచ్చితమైన డేటా సేకరించి సైట్ లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీల్లో జీవనోపాదుల పెంపు, ఆరోగ్యకరమైన పంచాయతీ, బాలల స్నేహపూర్వక పంచాయతీ, పచ్చదనం, పరిశుభ్రత, పంచాయతీ స్వయంసమృద్ధి, మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం తదితర థీమ్ ల సూచికల్లో భాగంగా సంబంధిత శాఖల నుంచి డేటా తీసుకోవాలన్నారు.