పీవీ సింధును సత్కరించిన చిరంజీవి

పీవీ సింధును సత్కరించిన చిరంజీవి

హైదరాబాద్: ఒలింపిక్స్ లో ఇప్పటికి రెండు సార్లు వరుసగా పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధుని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించారు. ఈనెల 20వ తేదీన జూబ్లిహిల్స్ లోని తన ఇంటికి పీవీ సింధును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు చిరంజీవి. తన సహ నటులు నాగార్జున, సుహాసిని, రాధిక తదితర ఆత్మీయులను ఆహ్వానించిన చిరంజీవి తన కుటుంబ సభ్యుల సమక్షంలో.. సహచర సినీ నటులతో కలసి సత్కరించారు. ఈ వేడుకలో మెగాస్టార్ ఫ్యామిలీ సభ్యులందరితో పాటు, నాగార్జున ఫ్యామిలీ,  అల్లు అరవింద్ ఫ్యామిలీ, మోహన్ బాబు ఫ్యామిలీ, కోచ్ గోపీచంద్, టి. సుబ్బరామిరెడ్డి, సుహాసిని మణిరత్నం, రాధికా శరత్ కుమార్, రానా దగ్గుబాటి, శర్వానంద్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్,  తదితరులు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ సింధును చూస్తుంటే చాలా గర్వంగా ఉందని, తన బిడ్డను సత్కరించుకున్నట్లే ఉందని తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవి మాటలతో పొంగిపోయిన పీవీ సింధు స్వచ్ఛమైన ప్రేమ చూపించే ఇలాంటి వారికోసం ఇంకా కష్టపడి దేశానికి మరిన్ని పతకాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.దీనికి సంబంధించిన వీడియోను చిరంజీవి కొద్దిసేపటి క్రితం ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఈ పోస్టులో ‘‘దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన పీవీ సింధును ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది..’’ అని చిరంజీవి తెలిపారు.

https://www.instagram.com/chiranjeevikonidela/?utm_source=ig_embed&ig_rid=7a386294-4a86-4c22-9cd7-a12523fe558c