బషీర్బాగ్, వెలుగు: ఫ్యూచర్ సిటీని స్వాగతించాల్సిందేనని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం తెలంగాణ రాష్ట్ర లోక్ దళ్(టీఆర్ఎల్డీ) ఆధ్వర్యంలో లక్షీకాపూల్లోని హోటల్ సెంట్రల్ కోర్ట్లో ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్ మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉందన్నారు. హైదరాబాద్ నగర విస్తరణ, అభివృద్ధికి అత్యధిక అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ స్వయం సమృద్ధి, సమ్మిళిత అభివృద్ధికి ప్రతీకగా నిలవాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. సమావేశంలో వచ్చిన సూచనలు, సిఫార్సులను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందిస్తామని వెల్లడించారు.
ఆర్థికవేత్త ప్రొఫెసర్ మనోహర్ మాట్లాడుతూ.. సేవారంగానికి ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. సీపీఐ (ఎంఎల్) కార్యదర్శి హన్మేశ్, టీఆర్ఎల్డీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి త్రిలోక్ త్యాగి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, వ్యవసాయ ప్రొఫెసర్ డాక్టర్ శ్రవణ్ కుమార్ తదితరులున్నారు.
