
- ప్రతి స్టూడెంట్ హెల్త్ ప్రొఫైల్ రెడీ చేయండి
- విద్యార్థులకు మంచి వసతి, ఫుడ్ అందించాలి
- బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లతో మంత్రి పొన్నం రివ్యూ
హైదరాబాద్, వెలుగు:అకడమిక్ ఇయర్ ప్రారంభం నుంచే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారికి నాణ్యమైన విద్యతో పాటు మంచి వసతి, ఫుడ్ అందించాలని బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లను ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లో జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని, అందుకు సంబంధించి బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకున్నామని తెలిపారు.
బుధవారం నుంచి అకడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుండటంతో అన్ని జిల్లాల బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు, ఆర్సీవోలు (రీజనల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్స్ ) ప్రిన్సిపాల్స్ తో సెక్రటేరియెట్ నుంచి మంత్రి పొన్నం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నాలుగు నెలల అద్దె బకాయిలు విడుదల
ప్రిన్సిపాల్స్, హాస్టల్ వార్డెన్స్ ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటికి 4 నెలల బకాయిలు రిలీజ్ చేశామని, అధికారులు భవనాల యజమానులతో సంప్రదించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి పొన్నం ఆదేశించారు. పాఠశాలలు, హాస్టల్స్ లో పరిశుభ్రత పాటించాలని, దోమల నుంచి రక్షణ కోసం నెట్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయి అధికారులు నెలవారీ రిపోర్ట్స్ తెప్పించుకోవాలన్నారు. పాఠశాలలు, హాస్టల్స్ లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే సంబంధిత ప్రిన్సిపాల్, వార్డెన్ల దృష్టికి తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలో ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో అధికారుల దృష్టికి సమస్యలు తీసుకొచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారి నెలవారీ హెల్త్ ప్రొఫైల్ ను సిద్ధం చేయాలని, ప్రతినెలా ఎత్తు, బరువు నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్, బీసీ గురుకుల సెక్రటరీ బడుగు సైదులు, జాయింట్ సెక్రటరీలు తిరుపతి, మద్దిలేటి, ఎంబీసీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సీఈవో అలోక్ కుమార్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.