
ఆమనగల్లు, వెలుగు: పేద ముస్లిం విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామ సమీపంలో జామియా ఇస్లామియా దారుల్ ఉలూమ్ కైసర్ ఉర్దూ పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలో ఖరీదవుతున్న విద్యను విద్యార్థులకు ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిన ప్రిన్సిపాల్ మౌలానా అబ్దుల్ కరీం షా ఖాద్రిని అభినందించారు.
పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, నాయకులు నరసింహ, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.