- బీహార్ అసెంబ్లీలో పోలీసుల దుశ్చర్య
- స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ బిల్ 2021పై రగడ
పాట్నా: బీహార్ అసెంబ్లీ మంగళవారం రక్తసిక్తంగా మారింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పోలీసులు బలవంతంగా బయటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలపై దాడి చేశారు. మరికొంతమందిని ఈడ్చుకుంటూ సభలోంచి వెలుపలికి తీసుకొచ్చారు. రాష్ట్ర పోలీసులకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే బిల్లు‘బీహార్ స్పెషల్ఆర్మ్డ్ పోలీస్ బిల్2021’ పై చర్చ సందర్భంగా ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. బిల్లును మూడు రోజుల కింద మొదటిసారి సభలో ప్రవేశపెట్టగా.. ఆర్జేడీ ఎమ్మెల్యేలు బిల్లు కాపీలను చించేశారు. పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. బిల్లు వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో స్పీకర్ మంగళవారానికి సభను వాయిదా వేశారు. మంగళవారం కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఎమ్మెల్యేల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో వారిని బయటికి పంపించాలని మార్షల్స్ను స్పీకర్ ఆదేశించారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలను తరలించే క్రమంలో వివాదం రేగింది. మార్షల్స్ వారిని కొట్టుకుంటూ, ఈడ్చుకుంటూ బయటికి తీసుకొచ్చారు. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలకు తీవ్ర గాయాలయ్యాయి. పలువురు రక్తమోడారు. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలను ఈడ్చుకుంటూ సభ నుంచి బయటకు తీసుకొస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.