క్షీణించిన ములాయంసింగ్ యాదవ్ ఆరోగ్యం

క్షీణించిన ములాయంసింగ్ యాదవ్ ఆరోగ్యం

యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో.. గుర్‌గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలోని ఐసీయూకు తరలించారు. 82 ఏళ్ల ములాయంసింగ్ యాదవ్..వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆయన  పరిస్థితి సీరియస్ కావడంతో ICUకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ములాయంసింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిని ప్రముఖ డాక్టర్  సుషీలా కటారియా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 

క్రియాశీల రాజకీయాలకు దూరంగా..
ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న అఖిలేష్ యాదవ్‌..వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. గతంలో ములాయం సింగ్‌ కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆయన్ను అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడుతున్నాయి. దీనికి తోడు...రెండో భార్య మరణం కూడా ఆయన్ను తీవ్రంగా కుంగదీసింది. వీటి కారణంగానే  క్రియాశీల రాజకీయాలకు ములాయం దూరంగానే ఉన్నారు. దీంతో కుమారుడు అఖిలేష్ యాదవ్ అన్నీ తానై పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేశ్ యాదవ్  మరోసారి ఎన్నికయ్యారు. 

యూపీ సీఎంగా మూడు సార్లు..
ములాయం సింగ్ యాదవ్ 1989, 1991,2003-07 మధ్య కాలంలో  మూడుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1996 నుంచి 98 మ‌ధ్యకాలంలో దేశ రక్షణ శాఖ మంత్రిగా కూడా విధులు నిర్వర్తించారు. 1974 నుంచి 2007 మ‌ధ్య కాలంలో యూపీ రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ప‌లు చిర‌స్మరణీయ విజ‌యాల‌తో సమాజ్ వాదీ పార్టీని ఉత్తరప్రదేశ్లో బ‌ల‌మైన ప‌క్షంగా నిలిపారు. ప్రస్తుతం ఆజ‌ంగఢ్ ఎంపీగా ఉన్న ములాయం సింగ్..ఆరోసారి లోక్‌స‌భ‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.