జనగామ, వెలుగు: భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువను ప్రభుత్వం సవరించింది. జిల్లా కేంద్రమైన జనగామలోని కొన్ని ఏరియాల్లో ఎకరాకు గతంలో రూ.1.01 కోట్లు ఉండేది. తాజా సవరణలో ఎకరానికి రూ.1,27,05,000కు సవరించారు. పాలకుర్తిలో గతంలో గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉన్న భూముల ధరలను మినిమం రూ.2.25 లక్షలకు సవరించారు. జనగామ తర్వాత ఈ జిల్లాలో రఘునాథపల్లి, స్టేషన్ ఘన్పూర్, బచ్చన్నపేట, లింగాల గణపురం, పాలకుర్తి వంటి మండలాలు నేషనల్, స్టేట్ రోడ్లకు సమీపంలో ఉన్నాయి.
వీటి మార్కెట్ విలువ చాలా తక్కువగా ఉన్నందున తాజా సవరణలో 25 శాతం నుంచి 90 శాతానికి పైగా పెరిగాయి. గతంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఇండ్ల స్థలాలకు మినిమం గజం రూ.500 ఉండగా ఇప్పుడు రూ.900 కు సవరించారు. మున్సిపాలిటీల్లో గజం రూ.2,100 ఉండగా, ఇప్పుడు రూ.3,200కు సవరించారు. జనగామ చౌరస్తాలో నాలుగు వైపులా రేట్లు సవరించారు. గతంలో రూ.12,500 నుంచి రూ.24,700 ఉంది. ఇప్పుడు గజం రేటును రూ.30 వేల నుంచి రూ.43,300 వరకూ సవరించింది.
పాలకుర్తిలో గతంలో హయ్యస్ట్ రేటు రూ.2400ఉండగా ఇప్పుడు హయ్యస్ట్ రేటు రూ. 10.200గా ఉంది. స్టేషన్ ఘన్పూర్లో గతంలో రూ.5800 ఉండగా, ఇప్పుడు రూ.8,700 ఉంది. రఘునాథపల్లిలో రూ.7800 నుంచి రూ.11,700కు మారింది. లింగాల ఘణపురంలో రూ.1600 నుంచి రూ.5,600 మధ్య ఉండగా కొండకండ్లలో రూ.2,300, రూ.4,200 మధ్య ఉంది. బచ్చన్నపేటలో రూ.2,300, రూ.2600, దేవరుప్పలో రూ.2300, రూ.3200, జఫర్గఢ్ లో రూ.2000, రూ.3000 మధ్య రేట్లు ఉన్నాయి. నర్మెటలో రూ.1,600, రూ.2000, చిల్పూరులో రూ.1300, తరిగొప్పులలో రూ.900గా ప్రభుత్వం మార్కెట్ రేటు నిర్ణయించింది.
