నాలుగు లేన్లుగా కురుమూర్తి ఘాట్ రోడ్డు..రూ.110 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం

నాలుగు లేన్లుగా   కురుమూర్తి ఘాట్ రోడ్డు..రూ.110 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
  •     మూడు యూనిట్లుగా పనులు ప్రారంభం
  •     భారీ వర్షాలు కురిసి బండరాళ్లు జారినా ఇబ్బంది రాకుండా రోడ్డు నిర్మాణం
  •     ఫ్లై ఓవర్​ ఏర్పాటుకు హెచ్​టీ లైన్​తో ఇబ్బందులు
  •     లైన్​మార్పునకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్​కు ప్రతిపాదనలు చేసిన ఆఫీసర్లు
  •     జాతర నాటికి ఘాట్​రోడ్డును అందుబాటులోకి తెచ్చేలా పనులు​

మహబూబ్​నగర్, వెలుగు : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా ఘాట్​ రోడ్డు నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించింది. ఇందు కోసం మొత్తం రూ.110 కోట్లను మంజూరు చేయగా, రానున్న నాలుగు నెలల్లో రోడ్డును భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చకచకా పనులు చేయిస్తోంది. 

మూడు యూనిట్లుగా పనులు .. 

రూ.110 కోట్లతో ఘాట్​ రోడ్డు పనులను మూడు యూనిట్లుగా చేస్తున్నారు. మొదటి యూనిట్​లో ఘాట్​ రోడ్డు నిర్మాణం జరగనుండగా, అమ్మాపూర్​ గ్రామం నుంచి కురుమూర్తి క్షేత్రం వెనుక ఉన్న గుట్టల మీదుగా నాలుగు వరుసల రోడ్డు (ఔట్​ వే)ను వేస్తున్నారు. ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండో యూనిట్​లో ఆలయ ఆర్చీ నుంచి కురుమూర్తి క్షేత్రం ప్రారంభంలోని స్వాగత ఆర్చీ వరకు ఉన్న డబుల్​ రోడ్డును నాలుగు వరుసల రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. ఇదే యూనిట్​లో కురుమూర్తి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న హనుమాన్​ విగ్రహం వద్ద కుడి, ఎడమ వైపు 300 మీటర్ల చొప్పున రోడ్డు వేసి జంక్షన్​ను ఏర్పాటు చేయనున్నారు. మూడో యూనిట్​లో సబ్​ స్టేషన్​ నుంచి కురుమూర్తి గుట్ట మీది వరకు ఫ్లై ఓవర్​ బ్రిడ్జి (ఇన్​ వే)ను నిర్మించే పనులు ప్రారంభించారు.

బ్రహ్మోత్సవాల నాటికి  అందుబాటులోకి ఘాట్​రోడ్డు..

అమ్మాపూర్​మీదుగా కురుమూర్తి క్షేత్రం వెనుక భాగం నుంచి ఘాట్​రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈసారి అక్టోబరులో జరిగే కురుమూర్తి బ్రహ్మోత్సవాల ప్రారంభం నాటికి ఈ రోడ్డును అందుబాటులోకి తీసుకురానున్నారు. వర్షా కాలంలో కూడా ఘాట్​ రోడ్డులో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిర్మాణాలు చేస్తున్నారు. ఘాట్​రోడ్డు చుట్టూ పెద్ద రాళ్లు ఉండడంతో భారీ వర్షాలకు అవి జారి పడకుండా స్టోన్​పిచ్చింగ్​చేస్తున్నారు. మట్టి కోతకు గురి కాకుండా, రాళ్లు జారి పడకుండా గేబిన్​బ్యాగ్​సిస్టంతో ఇనుప జాలీలు ఏర్పాటు చేస్తున్నారు. 

స్టోన్​స్లైడింగ్​ జరిగినా ప్రమాదం లేకుండా ట్రెంచ్​కట్టింగ్​చేసి రోడ్డు నిర్మిస్తున్నారు. కాగా, ఘాట్​రోడ్డు మధ్యలో రెండు కొండల మధ్య బాక్స్​కల్వర్ట్​ డిజైన్​తో రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కానీ, ఈ పద్ధతిలో రోడ్డు నిర్మిస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇంజినీరింగ్​ఆఫీసర్లు ఇటీవల సూచనలు చేశారు. దీంతో రెండు కొండల మధ్య అండర్​వెంట్​పాస్​(యూవీపీ) లేదా మైనర్​ బ్రిడ్జ్​ (ఎంఎన్​బీ) పద్ధతిలో రోడ్డు వేయాల్సి ఉంటుందని ఆర్​అండ్​బీకి ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలు ఆమోదం రాగానే రెండు కొండల మధ్య మిగతా పనులు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఘాట్​రోడ్డులో కొండలు, రోడ్డకు మధ్య రెండున్నర మీటర్ల దూరం నుంచి నుంచి 15 మీటర్ల గ్యాప్​తో రోడ్డు పనులు చేస్తున్నారు. 

హెచ్​టీ లైన్​తో ఇబ్బందులు..

కురుమూర్తి క్షేత్రానికి ప్రారంభంలో ఉన్న విద్యుత్​సబ్​స్టేషన్​సమీపం నుంచి గుట్ట మీది వరకు ఫ్లై ఓవర్​ను నిర్మించాల్సి ఉంది. మొత్తం 27 పిల్లర్లతో ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేయాల్సి ఉండగా,  మొదట 11 పిల్లర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఆరు పిల్లర్లకు ఫుటింగ్​ పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ ఆరింటికి కాంక్రీట్​పనులు మొదలు పెట్టారు. మిగతా ఐదు పిల్లర్ల పనులు మొదలు పెట్టడానికి సబ్​స్టేషన్​నుంచి వెళ్లిన హై టెన్షన్​(హెచ్​టీ) లైన్​ అడ్డుగా వస్తోంది. ఈ పనులు ముందుకు సాగాలంటే ఈ లైన్​కు ఆల్టర్నేట్​ లైన్​ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందు కోసం విద్యుత్​ శాఖకు ఆఫీసర్లు ఆల్టర్నేట్​ లైన్​ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించారు. దీనికి ఆమోదం రాగానే మిగతా పిల్లర్ల పనులు మొదలు పెట్టనున్నారు.

కురుమూర్తి అభివృద్ధికి  మరో రూ.70 కోట్లతో ప్రతిపాదనలు

యాదాద్రి తరహాలో కురుమూర్తి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే నా డ్రీమ్. ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్న. రూ.110 కోట్లతో నిర్మిస్తున్న ఘాట్​ రోడ్డు నిర్మాణానికి సీఎం రేవంత్​రెడ్డి శంకుస్థాపన చేయగా, పనులు జెట్​ స్పీడులో జరుగుతున్నాయి. రానున్న బ్రహ్మోత్సవాల నాటికి వెనుక భాగం పనులు పూర్తి చేసి, ముందు భాగం పనులు వచ్చే జూన్​ వరకు పూర్తి చేస్తాం. మహా మండపం కోసం డ్రాయింగ్స్​ పూర్తయ్యాయి. ఈ మండపంలోనే క్యూ కాంప్లెక్స్​ ఏర్పాటు చేస్తాం. భక్తులు కూర్చోవడానికి వీలుగా వసతులు కల్పిస్తాం. రూ.73 లక్షలతో షెడ్డు నిర్మాణం కంప్లీట్​అయ్యింది. మరో రూ.70 కోట్లతో కాటేజీలు, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశాం. 

-జి.మధుసూదన్​ రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర