తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాల కలకలం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాల కలకలం

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 15 ప్రాంతాల్లో ఎన్ ఐఏ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఏపీలోని  గుంటూరు,  తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లోని పౌరహక్కుల నేతల ఇళ్లలో ఏకాలంలో  ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 2న ఉదయం నుంచే  హైదరాబాద్ లోని  భవాని, అడ్వకేట్ సురేష్ ఇంట్లో..ఆల్వాల్ లోని సుభాష్ నగర్ లో బంధుమిత్రుల సంఘం సభ్యులు ఇళ్లపై ఎన్ఐఏ దాడులు చేస్తున్నారు.

నెల్లూరులో ఏపీ సీఎల్‌సీ ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో..  పౌరహక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న అన్నపూర్ణ, అనూష నివాసంలో ఎన్ఐఏ దాడులు చేస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో డాక్టర్ రాజారావు ఇంట్లో సోదాలు చేస్తున్నారు . రాజారావు మావోయిస్టు సానుభూతి పరుడిగా ఆరోపణలు ఉన్నాయి.

తిరుపతిలో ఉంటున్న న్యాయవాది క్రాంతి చైతన్య ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. అలాగే  ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు దుడ్డు వెంకటరావు ఇంట్లో సోదాలు చేస్తోంది ఎన్ ఐఏ.