- మంగళవారం మధ్యాహ్నంతో ముగిసిన విత్ డ్రా గడువు
- అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన అధికారులు
- 6 జిల్లాల్లో 12 మున్సిపాలిటీలు, 260 వార్డులు
- 11న ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోనున్న పార్టీలు, క్యాండిడేట్లు
వరంగల్/ నెట్ వర్క్, వెలుగు: ఓరుగల్లు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్ తీర్పు కోసం సై అంటే సై అంటూ బరిలో నిలిచిన క్యాండిడేట్ల సంఖ్య తేలింది. ఉమ్మడి వరంగల్ 6 జిల్లాల్లోని 12 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 260 వార్డులున్నాయి. గత నెల 27న ఎన్నికల నగారా మోగగా, 30వ తేదీ నాటికి నామినేషన్లు స్వీకరించారు. ఆపై ఆఫీసర్లు చేసిన స్క్రూట్నీలో సరైన వివరాలు ఇవ్వని నామినేషన్లను తిరస్కరించారు.
ఎవరైనా పోటీనుంచి విత్డ్రా చేసుకోడానికి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఎలక్షన్ కమిషన్ గడువు ఇచ్చింది. పలువురు క్యాండిడేట్లు పోటీనుంచి వైదొలుగుతూ తమ నామినేషన్లు వెనక్కు తీసుకున్నారు. దీంతో మొత్తం 12 మున్సిపాలిటీల్లో ఫైనల్గా1,077 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఫైనల్గా బరిలో ఉన్న అభ్యర్థులకు ఈసీ అధికారులు గుర్తులు సైతం కేటాయించారు. దీంతో ఈనెల 11న నిర్వహించబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలు, క్యాండిడేట్లు తాడోపేడో
తేల్చుకోనున్నారు.
ఉపసంహరణ ప్రక్రియ పరిశీలన
జనగామ అర్బన్ : జనగామ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ పనులను అడిషనల్ కలెక్టర్ పింకేశ్కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది, కౌంటర్ల నిర్వహణ, రికార్డు నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు సమయపాలనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం జనగామ పట్టణంలోని ఏకశిలా బీఎడ్ కాలేజీలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో గోపీరామ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, తహసీల్దార్ మోహసీన్, మాస్టర్ ట్రైనర్ మెరుగు బాలరాజు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
స్క్రూట్నీ, మంగళవారం విత్ డ్రా అనంతరం బరిలో నిలిచినవారు
మున్సిపాలిటీ వార్డులు నామినేషన్లు పోటీదారులు
నర్సంపేట 30 291 120
వర్ధన్నపేట 12 121 50
పరకాల 22 215 100
ములుగు 20 199 83
భూపాలపల్లి 30 230 107
జనగామ 30 186 127
స్టేషన్ ఘన్పూర్ 18 114 82
తొర్రూర్ 16 195 63
కేసముద్రం 16 220 63
డోర్నకల్ 15 196 64
మరిపెడ 15 178 63
మహబూబాబాద్ 36 312 155
మొత్తం 260 2,630 1,077
