
- ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
ములుగు, వెలుగు: రెండు రోజులుగా ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షం, ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి పలు గ్రామాలకు సరఫరా నిలిచిపోయిందని, వెంటనే అధికారులు, సిబ్బంది స్పందించి రాత్రింబవళ్లు కష్టపడి పునరుద్ధరణ చేపట్టారని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూపాలపల్లి సర్కిల్పరిధిలోని భూపాలపల్లి జిల్లా రేగొండ, గణపురం, ములుగు జిల్లా వెంకటాపూర్మండలం వెల్తుర్లపల్లి సబ్ స్టేషన్ల పరిధిలో ధ్వంసమైన, పునరుద్ధరించబడిన విద్యుత్ లైన్లను క్షేత్రస్థాయిలో సీఎండీ పరిశీలించారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాత్రంతా సిబ్బంది శ్రమించి విద్యుత్ పునరుద్ధరించారని కొనియాడారు. ఇప్పటివరకు సర్కిల్ పరిధిలో 351 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని, సుమారుగా రూ.55లక్షల మేర నష్టం జరిగినట్లు సీఎండీ వివరించారు. రేగొండ, గణపురం, వెల్తుర్లపల్లి సబ్ స్టేషన్ల పరిధిలోనే భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. కార్యక్రమంలో సీఈ రాజు చౌహన్, భూపాలపల్లి సర్కిల్ ఎస్ఈ మల్చూర్ నాయక్, జీఎం ఏ.సురేందర్, ములుగు డీఈ నాగేశ్వర్ రావు, భూపాలపల్లి డీఈ పాపి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.