సోషల్ మీడియా స్టార్ హత్యకు గురయ్యారు. 13 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్న ప్రముఖ టిక్టాక్ స్టార్ను కొందరు దుండగులు కారులోనే కాల్చి చంపారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
పాకిస్తాన్లోని తక్సిలాలో ఆగస్టు 14న ఈ ఘటన చోటుచేసుకుంది. ఆన్లైన్లో అయేషా గిలమానాగా పాపులర్ అయిన షమ్సో బీబీ (టిక్టాక్ స్టార్) తన కారులో వెళ్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో మెడలో బుల్లెట్ తగిలి ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల వల్ల ఆమె కారు అదుపుతప్పి ఒక ట్రక్కును ఢీకొనడంతో, ఆమె 15 ఏళ్ల చెల్లెలు అసీమా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరింది.
ఫోన్ కాల్ చేసి బయటకు పిలిచి..
షమ్సో బీబీ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కాల్పులు జరగడానికి కొద్దిసేపటి ముందు కాషిఫ్ అనే వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి ఇంటి బయటికి రావాలని కోరాడు. దీంతో ఆమె తన సోదరి, సోదరుడితో కలిసి కారులో బయలుదేరింది. ఆ సమయంలోనే దుండగులు అతి సమీపం నుంచి కారుపై కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల దర్యాప్తు
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రావల్పిండి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఆగస్టు 18 నాటికి అనుమానితులకు సంబంధించిన నలుగురు బంధువులు, సహచరులను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నారు.
సోషల్ మీడియా స్టార్గా గుర్తింపు
షమ్సో బీబీ గత 3-4 సంవత్సరాలుగా టిక్టాక్లో వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెకు టిక్టాక్లో 13 లక్షల ఫాలోవర్లు, యూట్యూబ్లో సుమారు 1,76,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆమె మరణం తర్వాత కుటుంబ సభ్యులు ఆమె టిక్టాక్ అకౌంట్ ను డియాక్టివేట్ చేశారు. పాకిస్తాన్లో సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్న మహిళలను టార్గెట్ చేసి వరుసగా హత్యలు జరుగుతుండటం పాకిస్తాన్ దేశంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
