
- సర్కారుకు తప్పు చేసినోళ్లను అరెస్టు చేసే దమ్ములేదు: రఘునందన్ రావు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ లో సిట్ దర్యాప్తు కేవలం కాలయాపన మాత్రమేననీ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పు చేసినవారిని అరెస్టు చేసే దమ్ము లేదని ఆయన ఆరోపించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 2020 నవంబర్లో జరిగిన దుబ్బాక ఉపఎన్నిక సమయంలోనే మొదలైందని చెప్పారు. అప్పట్లోనే పోలీసులు తమ ఫోన్లు వింటున్నారని, అప్పటి డీజీపీకి ఫిర్యాదులు చేశానని, కానీ వాటిపై ఎటువంటి స్పందన రాలేదని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు.. అప్పటి డీజీ, అప్పటి ప్రభుత్వ పెద్దలు చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశానని చెప్పారని, అదే రాసి రిమాండ్ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ మూలాఖత్ అయి ప్రజలను ఆగం చేస్తున్నాయని ఆరోపించారు. తనకు ఇటీవల వచ్చిన బెదిరింపు కాల్పైనా రఘునందన్ రావు స్పందించారు. దానిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారని, విచారణ జరుగుతోందని తెలిపారు.