
- మరి కమాండ్ కంట్రోల్ కట్టింది టైంపాస్ కోసమా?: రాజాసింగ్
హైదరాబాద్, వెలుగు: వందల కోట్లు పెట్టి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను టైం పాస్ కోసం కట్టారా అని ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. సాధారణంగా బెదిరింపు కాల్ ఎవరికైనా వస్తే వెంటనే ఆ ఫోన్ చేసే వ్యక్తిని గుర్తించి అరెస్టు చేస్తారని ఒక ప్రకటనలో తెలిపారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనపై బక్రీద్ కంటే ముందు నుంచి వందల బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినా, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేని పరిస్థితిలో పోలీస్ అధికారులున్నారని విమర్శించారు.
పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చిన మేయర్ కు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారని..కానీ తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్న వ్యక్తిని మాత్రం అరెస్టు చేయరా అంటూ మండిపడ్డారు. తాను బీజేపీలో ఉన్నందుకే పోలీసులు చిన్నచూపు చూస్తున్నారా? అంటూ రాజాసింగ్ ఫైర్ అయ్యారు.