గుంతలు, బురదతో రోడ్లంతా ఆగమాగం

గుంతలు, బురదతో రోడ్లంతా ఆగమాగం
  • భారీ వర్షాలకు రోడ్డు ధ్వంసం
  • రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రోడ్ల దుస్థితి

రంగారెడ్డి జిల్లా: చిన్నపాటి వర్షం వచ్చినా సరే రోడ్లంతా నాశనం.. గుంతలు, బురదమయం గా మారే రోడ్లపై వాహనాదారులే కాదు.. పాదచారులు సైతం ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. చాలా చోట్ల గుంతలుపడ్డాయి. కిస్మత్ పూర్ ఓంనగర్ కాలనీతోపాటు.. ఎక్సర్ సైజ్ అకాడమీ బ్యాక్ సైడ్ రోడ్లు అధ్వాన్నంగా మారాయి. వర్షాకాలం వస్తోందంటే ఇక్కడి ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది.

గుంతలు, బురద రోడ్లతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్లపై ప్రయాణించే టూవీలర్ వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాల ప్రమాదంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే పాదచారులు సైతం గాయపడుతున్న దాఖలాలు ఎన్నో. అధికారులు ఇప్పటికైనా స్పందించి త్వరగా రోడ్లు మరమ్మత్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు.