
- చత్తీస్గఢ్ ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో భారీ కూంబింగ్
- 25 వేల మంది బలగాలతో అణువణువూ జల్లెడ.. దండకారణ్యంలో టెన్షన్
- పోలీసుల చేతుల్లో అగ్రనేతల లొకేషన్స్
- లొంగిపోకపోతే ఎన్కౌంటరే.. బస్తర్ ఐజీ హెచ్చరిక
భద్రాచలం, వెలుగు: ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా చత్తీస్గఢ్ సర్కారువర్షాకాలంలోనూ కూంబింగ్ నిర్వహిస్తున్నది. హిడ్మాలాంటి అగ్రనేతలే టార్గెట్గా ‘ఆపరేషన్మాన్సూన్’ పేరిట భద్రతా బలగాలను రంగంలోకి దించింది. దీంతో దండకారణ్యంలో టెన్షన్ నెలకొన్నది. బస్తర్ ఐజీ సుందర్రాజ్ ఇటీవల చేసిన ప్రకటన మావోయిస్టు వర్గాల్లో కలకలం రేపుతున్నది. తమ చేతుల్లో మావోయిస్టు అగ్రనేతల లొకేషన్స్ ఉన్నాయని, వారు లొంగిపోకపోతే ఎన్కౌంటర్అవుతారని ఆయన ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఆయన అన్నట్లుగానే ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాను 25 వేల మంది బలగాలతో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, మిలిటరీ చీఫ్, హిడ్మా శిష్యుడు దేవ కదలికలను గుర్తించారు. వారిని లక్ష్యంగా చేసుకొని కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నట్లుగా తెలుస్తున్నది. దీనికితోడు మావోయిస్టు దళపతి గణపతి, కేంద్ర కమిటీ సభ్యులు సుజాత, పుల్లూరి ప్రసాదరావు సమాచారం కూడా కేంద్ర నిఘా వర్గాలు కనిపెట్టినట్లుగా ప్రచారం జరుగుతున్నది.
హిడ్మా కదలికలు పసిగట్టిన బలగాలు
చత్తీస్గఢ్ పోలీసులు, కేంద్ర బలగాల ప్రధాన టార్గెట్ హిడ్మానే. ఆయన ఆచూకీ కోసం ఏళ్ల తరబడి బలగాలు అన్వేషిస్తున్నాయి. భూ ఉపరితలానికి 1500 అడుగుల ఎత్తులో హైరెజిల్యూషన్ డ్రోన్ కెమెరాలతో అతడి కదలికలను భద్రతా బలగాలు పసిగడుతున్నట్టు తెలుస్తున్నది. కర్రెగుట్టల్లో దొరికినట్లే దొరికి హిడ్మా తప్పించుకున్నాడు.
ఇంద్రావతి నేషనల్ పార్కు ఏరియాలోనే వీరి జాడను కనిపెట్టిన భద్రతా బలగాలు ‘ఆపరేషన్ మాన్సూన్’ పేరిట కూంబింగ్ తీవ్రం చేశాయి. ఈ క్రమంలో చత్తీస్గఢ్లో ఫైరింగ్పై స్పందించాలని పౌరహక్కుల సంఘాలకు ప్రొఫెసర్ హరగోపాల్సూచించారు. బస్తర్ ఐజీ సుందర్రాజ్ పి ప్రకటనను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రజాస్వామ్య వ్యతిరేక కాల్పులను ఆపివేయాలని పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.