వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెల్త్ కండీషన్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నాడా..? అసలు ఆయనకు ఏమైంది..? అన్న చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం (మార్చి 2) వైట్ హౌస్లో ఇరాన్ యుద్ధంపై ప్రసంగిస్తుండగా ట్రంప్ మెడపై ఒక గాయం కనిపించడమే ఈ చర్చలకు ప్రధాన కారణం. ట్రంప్ మెడపై కుడి వైపు ఒక ఎర్రటి మచ్చ (దద్దురు) కనిపించింది. దీంతో ఆయన ఆరోగ్యంపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో ట్రంప్ మెడపై కనిపించిన గాయంపై అతని వ్యక్తిగత వైద్యుడు సీన్ బార్బబెల్లా క్లారిటీ ఇచ్చారు. ట్రంప్ తన మెడకు కుడి వైపున స్కిన్ ఇన్ఫెక్షన్కు చాలా సాధారణమైన క్రీమ్ను ఉపయోగిస్తున్నారని.. ఇది చర్మ చికిత్స నివారణ దుష్ప్రభావమని పేర్కొన్నారు. ఆ మచ్చ కొన్ని వారాల పాటు ఉంటుందని చెప్పారు.
గతంలో కూడా ప్రెసిడెంట్ ట్రంప్కు స్కిన్ ఇన్ఫెక్షన్ వ్యాధి వచ్చిన విషయం తెలిసిందే. దావోస్ ఆర్ధిక సమ్మిట్లో మాట్లాడుతుండగా ఆయన చేతికి ఎర్రటి మచ్చలు కనిపించడంతో అప్పట్లో ట్రంప్ ఆరోగ్యంపై జోరుగా చర్చ జరిగింది. అయితే.. ఇతర దేశాధినేతలు, అధికారులతో ట్రంప్ తరచు కరచాలనం చేయడంతో పాటు హృదయ ఆరోగ్యానికి ఆస్ప్రిన్ వాడటం దీనికి కారణమని వైద్యులు క్లారిటీ ఇచ్చారు.
►ALSO READ | అమెరికా- ఇజ్రాయోల్ దాడులు.. ఇరాన్ లో 787 మంది మృతి
తాజాగా మరోసారి ట్రంప్ చర్మంపై ఇదే తరహా మచ్చలు కనిపించడంతో ఆయన హెల్త్ కండీషన్పై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోన్న వేళ ట్రంప్ మెడపై గాయం కనిపించడంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై వైట్ హౌస్ వైద్య విభాగం వివరణ ఇచ్చింది. ట్రంప్ కు ఎలాంటి ప్రమాదం లేదని.. ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది.
