న్యూఢిల్లీ: గ్రే మ్యాటర్.. మెదడులో ఓ భాగం. ఇంకా చెప్పాలంటే మెదడులో ఎక్కువ మొత్తంలో ఉండే నల్లటి భాగం. మనం కదలాలన్నా, తినాలన్నా, జ్ఞాపకశక్తి బాగుండాలన్నా, మన ఎమోషన్ను బయటకు చెప్పాలన్నా, ఏ పని చేయాలన్నా.. దాని నుంచి ఆదేశాలు రావాల్సిందే. మన శరీరం, మనసును ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ (కేంద్ర నాడీ వ్యవస్థ)కే మూలం అది. అలాంటి గ్రే మ్యాటర్ను కరోనా తినేస్తోంది. కరోనా సోకి ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ దాకా వెళ్లినోళ్లలో కొందరిలో మెదడు ముందు భాగంలోని నల్లటి పదార్థం తగ్గిపోతోంది. నరాల సంబంధ సమస్యలతో బాధపడుతున్న 120 మందిపై అమెరికాలోని జార్జియా స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు చేసిన పరిశోధనలో ఈ షాకింగ్ విషయం వెల్లడైంది. అందులో 58 మందికి కరోనా ఉండగా, మిగతా 60 మందిలో కరోనా లేదు.
వాళ్లకే ఎక్కువ రిస్క్
కరోనా సోకి ఆక్సిజన్ అవసరం పడిన వాళ్లు, వెంటిలేటర్ దాకా వెళ్లిన వాళ్లలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని వక్హార్డ్ హాస్పిటల్ న్యూరాలజిస్టు డాక్టర్ పవన్ పాయ్ చెప్పారు. అంటే కరోనా వైరల్ లోడ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ప్రభావం మెదడుపై పడుతుందన్నారు. మునుపే మెదడు సమస్యలున్నోళ్లలో కరోనా ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటోందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ బీఎన్ గంగాధర్ తెలిపారు. హైబీపీ ఉన్నోళ్లు, లావుగా ఉన్నవాళ్లలోనూ గ్రే మ్యాటర్ను కరోనా తగ్గించేస్తుందని చెప్పారు. మెదడు చిన్నగా ఉన్నవాళ్లలో దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందన్నారు. అలాంటి వాళ్లలోనే మానసిక సమస్యలు వస్తున్నాయని డాక్టర్ పవన్ పాయ్ చెప్పారు. ఎప్పటికప్పుడు మూడ్స్ కూడా మారిపోతుంటాయని వివరించారు.
కరోనా ఒక్కటే కారణం కాకపోవచ్చు!
మ్యాక్స్ హాస్పిటల్కు చెందిన న్యూరాలజీ డిపార్ట్మెంట్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ముకేశ్ కుమార్ మాత్రం.. మెదడు గ్రే మ్యాటర్ తగ్గిపోవడానికి కరోనా ఒక్కటే కారణం కాకపోవచ్చంటున్నారు. దీనిని నిర్ధారించేందుకు పెద్ద స్టడీలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నోళ్లు మానసికంగా సమస్యలు ఎదుర్కోవడం సహజమేనని చెప్పారు. ష్కీజోఫ్రీనియా, సైకోసిస్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) ఉన్నవాళ్లలోనూ గ్రే మ్యాటర్ తక్కువగా ఉంటుందన్నారు.
మంచిగ నిద్రపోవాలె
కరోనా నుంచి కోలుకున్న తర్వాత మానసిక సమస్యలు ఉన్నట్టు అనుమానం కలిగితే వెంటనే డాక్టర్ దగ్గరకు పోవాలని పవన్ పాయ్ సూచించారు. మెదడు ఆరోగ్యం బాగుండాలంటే కంటి నిండా నిద్రపోవాలని చెప్పారు. ‘‘రాత్రిపూట 8 నుంచి 9 గంటల పాటు నిద్రపోతే మెదడు ఆరోగ్యం బాగుంటుంది. ఒత్తిడిని కట్టడి చేయాలి. బీపీ, షుగర్లను కంట్రోల్లో ఉంచుకోవాలి. రోజూ ఎక్సర్సైజ్ చేయాలి. రూబిక్ క్యూబ్, పజిల్స్ వంటి వాటిని సాల్వ్ చేస్తూ మెదడు శక్తిని పెంచుకోవాలి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే తిండి తినాలి. పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి’’ అని ఆయన సూచనలు చేశారు.
15% మందిలో సమస్య
కరోనా సోకినవారిలో 15 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు స్టడీలో తేల్చారు. నిద్రపట్టకపోవడం, మెదడువాపు, స్ట్రోక్, వాసన, రుచి కోల్పోవడం, కండరాలు, నరాల నొప్పులు, మూర్ఛ, గిలైన్ బ్యారీ సిండ్రోమ్, బ్రెయిన్ ఫాగ్, కన్ఫ్యూజన్, మూడ్స్ మారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్టు గుర్తించారు.